Wednesday, February 27, 2019

వాజపేయి

సంస్కృతం లో "వాజపేయి" అనగా వేదములు నిర్వచించిన మహా యజ్ఞాలను జరిపిన వాడు అని అర్ధం. ఇటీవల పరమ పదించిన అటల్ బిహారీ వాజపేయి గారు ఏ విధం గా సార్ధక నామధేయులు అయ్యారో మనం ఇక్కడ మననం చేసికొనే ప్రయత్నం చేద్దాం

  • వాజపేయి  తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని జాతి ప్రయోజనాలకు సదా దోహద పడే యజ్ఞం తన జీవితం యావత్తు 93 సంవత్సరాల పాటు చేశారు
  • శత్రువు వెన్ను పోటు పొడిచినా చెదరక సైనిక స్థయిర్యాన్ని ప్రోత్సహిస్తూ కార్గిల్ విజయ పోరాట యజ్ఞాన్ని ముందుండి నడిపించారు
  • దీర్ఘ కాల ప్రయోజనాలు దృష్టి లో ఉంచుకొని ప్రపంచానికి ఎదురొడ్డి భారత దేశం పరమాణు శక్తి గా నిలిపే క్రమం లో మహోత్కృష్టమైన యజ్ఞాన్ని నిర్వహించారు
  • "వసుదైక కుటుంబం" భారత దేశం ప్రతిపాదించిన  సిద్ధాంతం అని ఐక్య రాజ్య సమితి లో చాటించి సౌభ్రాతుత్వ యజ్ఞాన్ని రాజకీయాలకి అతీతంగా నిర్వహించారు
  • 1971 యుద్ధం లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధాని ఇందిరా గాంధీ ని "దుర్గ" గా అభివర్ణించి రాజకీయ అతీత నైతిక యజ్ఞం నిర్వహించారు 
  • సరిహద్దు లకు హద్దులు చాటుతూ మొదటి సారి ఢిల్లీ నించి లాహోర్ కి బస్సు ఏర్పాటు ద్వారా ప్రయత్న లోపం లేని శాంతి యజ్ఞాన్ని చేశారు 
  • 13 విభేద భావ జాల పార్టీలను ఏకత్రాటి పై నడిపి సమైక్య యజ్ఞాన్ని అయిదు సంవత్సరాలు పాటు నడిపించారు
  • రాజకీయ వేత్త, హాస్య చతురత, కవి, సమయస్ఫూర్తి, అంకిత భావం, సిద్ధాంత ప్రమాణ వ్యక్తిత్వం ఇలా తన జీవితం అంతా బహుముఖ ప్రజ్ఞ యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహించారు
ఈ విధంగా అటల్ బిహారీ వాజపేయి తన జీవనాన్నిదేశ ప్రయోజన యజ్ఞంలో పూర్ణాహుతి గావించారని అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు

సీతా రామ దాంపత్యం


మరికొద్ది రోజుల్లో మనమందరం శ్రీ రామ నవమి జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ "సీతా రామ కళ్యాణం" గురించి కొంచం వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పండగ భారత దేశంలో మారు మూల గ్రామాలలో వివిధ పద్ధతులు ఆచారాలకు అనుగుణంగా జరప బడుతున్నది. ఎప్పుడో త్రేతా యుగం లో జరిగిన సీతా రాముల కల్యాణం ఇంకా ఎందుకని చేస్తున్నాం అన్న తర్కాలోచన లేని రోజుల్లో పండగ గుర్తులు ఏవయ్యా అంటే రేడియో లో విన్న భద్రాచలం లో కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం, గుళ్ళో మిరియాలు వేసినా తియ్యగానే ఉండే పానకం !! ఒక్క సారి అసలు త్రేతా యుగం అనేది ఎప్పుడు హిందూ కాల  మానం ప్రకారం ఎప్పుడు అయ్యింది అని ఆలోచిస్తే, సీతా రామ కళ్యాణం రమారమి ఒక 2.6 మిలియన్ సంవత్సరాలు జరిగి ఉండచ్చు అన్న నిజం తెలిస్తే మనమందరం ఆశ్చర్య చకితులు అవకమానము. అయితే ఇన్నీ సంవత్సరాల తర్వాత కూడా మనము ఈ సీత రామ కల్యాణ వైభయాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకొంటున్నామో, ఈ సందర్భంగా మానవాళికి ఇవ్వబడిన సందేశం ఏంటి, ఇది కేవలం పండగేనా లేక మన జీవన విధానాలను సన్మార్గములో మార్చుకోగలిగిన అపురూపమైన అవకాశమా.. పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 

జగత్తులో అందరి కంటే ముందరి వారు, అన్నింటింకి మూలా దారం ఎవరయ్యా అంటే, "ఆ అది దంపతులు శివ పార్వతులు" మనకి స్పురణకి వస్తారు. అమ్మ వారికి, అయ్య వారికి మధ్య దాపరికాలు ఉండవు. హెచ్చు తగ్గులకు అసలే తావు లేదు. మనకి అందిన పురాణాలు, వాంగ్మయాలు, వ్రతాలు, వ్రత  కల్పాలు అన్నీ, అమ్మ తన పిల్లల మీద దయతో, ఆదరంతో అయ్య ని అడుగుతుంది, అయన చెప్పడం జరగ బడుతుంది. ఆ కరుణ ని అవధులు, పరిమితులు ఉండవు. ఉదాహరణకి, మనమందరం ఉద్దరింప బడ డానికి, "విష్ణు" సహస్ర నామ పారాయణం ఉదహరింప బడితే, అమ్మ వెంటనే,

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యకే పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.

శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

సీత రాములు మన అందరి లాగానే సామాన్యమైన మానవులాగానే దాంపత్య వైభవము గురించి అవతరించిన దంపతులు. మన అందరి లాగానే వాళ్ళు కూడా సుఖ దుఃఖాలు, కోప తాపాలు వంటి సామాన్యమైన అనుభూతులు అనుభవించిన వారే. అందుకనే ఏ దంపతులైనా "సీతా రాములల్లె కలకాలం అన్యోనంగా పది కాలాలు వర్ధిల్లమని" ఆశీర్వాదం ఇవ్వడం మనమందరమ్ చూస్తూనే ఉంటాం. ఈ ఆశీర్వాదం ఎప్పుడూ "శివ పార్వతులల్లె" లేక "రుక్మిణి కృష్ణులల్లే"  అని ఎప్పటికి ఉండదు. అయితే ఎందుకని వీరి దాంపత్య వైభవం ఇంత ప్రత్యేకత ఎందుకని సమకూరిందో తెలిసికొనే ప్రయత్నం చేద్దాం. 

వారి దాంపత్యాన్ని గురించి ప్రస్తావించే ముందర, అస్సలు ఎవరి గురించయ్యా మనం మాట్లాడ బోయేది?

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రేమేయం 
సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
అజానుభాహుం అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి 

రాముడంటే ఎటువంటి వాడు?

రామో విగ్రహవాన్ ధర్మః !! రామో దుర్నాభి బాషితే !! 
రామః కమల పత్రక్షా సర్వ సత్వ మనోహారః 
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే 
తెజశా దిత్య సంకాశః క్షమయః పృధివీ సమః 
బృహస్పతి సమో భుధ్యా యశసా వాశావో పమః 

రామ చంద్రుడు ధర్మానికి పూర్తి ప్రతిరూపం. రాముని మాటకు రెండు భావాలూ ఉండవు. రాముని నమ స్మరణతోనే ఈ ప్రకృతి అంతా పులకరిస్తుంది అట. కోటి సూర్యులకు తుల్యమైన తేజస్సు తో బాటు పృథ్వి కి సమానమైన వినయ సంపన్నుడు, బుద్ధి లో బృహస్పతి, ధైర్యశాలి ఆ రామ చంద్రుడట. శ్రీ మహావిష్ణువుని రామావతారంలో రెండు ప్రయోజనాలు. ఒకటి రావణాసురుని అంతం ఇంకొకటి మానవాళి కి ధర్మాచరణ వైశిష్టత గురించి ఇచ్చిన ప్రత్యక్ష నిదర్శనం. ఇది కృష్ణ, నరసింహ వంటి ఇతర అవతారాలకు  పూర్తి విరుద్ధం. 

మరి సీతమ్మ తల్లో !!

ఇయం సా ధర్మ శీలస్యా  మైదిలస్య మహాత్మనా 
సుతా జనక రాజస్యా భ ర్త్రు దృడ వ్రతా 

సకల ధర్మాత్ముడైన జనక మహారాజు నాగలి పట్టి దున్నుతుండగా భూమి నిండి ఉద్భవించిన మహా సాధ్వి. జనకుడు ఈ అయోనిజను మామూలు వ్యక్తులకు ఇచ్చి తన తండ్రి బాధ్యతను అంత సులభంగా నిర్వర్చించాలని అనుకోలేదు. అనితర సాధ్యమైన మహా శివుని విల్లు చేపట్టే ధీరుని కి మాత్రమే సీతాదేవి ని పరిణయమాడ గలిగిన అర్హుడని నిర్ణయించాడు. 

హనుమ సీతాదేవి చూసిన సిద్ది సర్గలో ఈ విధంగా భావించి సంతుష్టుడు అవుతాడు. 

రాజ్యం వా త్రిషు లోకేషు సీతవా జనకాత్మజా 
త్రై లోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్  కలామ్ 

ఒక వేళ శ్రీ రామునకు కనుక సీత మరియు ముల్లోక రాజ్యాధికారం లలో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలంటే, ఒక్క ముహూర్త సమయం కూడా ఆలోచించ కుండా సీతాదేవిని కోరుకొంటాడు. రాముని మనస్సు లో ఏముందో సీత ఎల్లా వేళలా తెలుస్తుంది, అదే విధం గా సీతా దేవి ఏమి కోరుకుంటుందో శ్రీ రామునికి సదా విదితమే !! వారిద్దరిది బాధ్యతాయుత మైన దాంపత్యం. పరస్పరం ఇరువురు కర్తవ్యమ్ గుర్తు చేసికొంటూనే ఉంటారు. మీ తండ్రి దశరధుడు నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాశం చెయ్య మంటే, ఈ అస్త్రాలు శస్త్రాలు వెంట పెట్టు కొని ఎందుకు వచ్చావయ్యా? రాక్షసులతో ప్రత్యక్ష వైరం లేకపోగా వాళ్ళ అందరిని సంహరిస్తానంటివే, అంటూనే సీతా దేవి రాముని దుష్ట శిక్షణ కై పరోక్షం గా దృడ సంకల్పుడిని చేస్తుంది. "సీతా !!  శరణా గతి చేసిన ఋషులను రక్షించడమే నా ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధన లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా నేను లెక్క చేయను" అని ప్రతిజ్ఞ చేయిస్తుంది. ఇదే విషయం ని లంక లో నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు, రామునికి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది . "రామా, మనశా వాచా కర్మణ, నిన్నే స్మరిస్తునాను అయ్యా !! మరి ఎందుకని వచ్చి నన్ను రక్షించవు ? నీవు శరణా గతులని రక్షిస్తావంటివే, మరి ఎందుకని నన్ను ఈ లంక లో నిండి, ఈ రాక్షసుల బారి నిండి కాపాడి తీసి కెళ్లవు ? నా వ్రతం లో గాని లేక తపస్సు లో గాని ఏమైనా లోపం ఉన్నదా" అంటూ హనుమ తో శ్రీ రాముడు కి సందేశం పంపిస్తుంది !!

వారిరువురు క్షణ కాలమైనా వియోగం భరించలేరు. అంతటి శ్రీరాముడు కూడా దుష్ట రాక్షస ప్రమేయంతో సీతాపహరణం జరిగిన వేళ నిస్సహాయుడు అవుతాడు. 

ఉపవాశ కృ శాం దీనాం నిశ్స్వ సంతీం  పునః పునః 
దదర్శ శుక్ల పక్షా ధౌ చంద్ర రేఖాం మివానలామ్ 

అపహరింపబడిన సీతాదేవి, శోకసముద్రురాలై అశోక వనంలో సదా పతి  చింతనతో అనుక్షణం గడుపుతూ ఉంటుంది. అదే విధంగా శ్రీ రామచంద్రుడు కూడా సర్వము కోల్పోయినవాడల్లే నిశ్శక్తుడై గడుపుతూ ఉంటాడు. ఇదేవిషయం హనుమ అశోకవనంలో ప్రస్థావిస్తాడు. 

నిత్యం ధ్యాన పరో రామో నిత్యం శోక పరాయణ 
నాన్యచింత యతే కించిత్ సతు కామవశమ్ గతః 

అమ్మా!! శ్రీ రామచంద్రుడు సకలావశ్తలందు నీ ధ్యాశ లోనే మునిగి, నిన్ను చేరుకొనడం అన్న ఆలోచన తప్ప వేరే ఏమీ కోరిక లేని వాడై ఉన్నాడమ్మా.. అంటూ హనుమ వివరిస్తాడు . అదే విధం గా సీతమ్మ తల్లి కూడా, 

దీనోవా రాజ్య హీనోవా వామో మే భర్త సమే గురు 
తమ్ నిత్య మనురక్తాస్మి యధా సూర్యం సువర్చలా 

రాక్షస రాజు రావణుడు సీతాదేవి ని ఐహిక లాభాలతో ప్రలోభపెడితే, ఆ అమ్మ, "నా రాముడు దీనుడైనా, రాజ్య హీనుడు అయినా, అతడే నాకు గురువు. నేను సదా నా పతికి  అనురక్తురాలును" అని అంటుంది.

ఇదే భావం అరణ్య కాండలో మరొక సందర్బం లో కూడా వెల్లడిస్తుంది. 14 సంవత్సరాల అరణ్య వాసం తండ్రి ఆజ్ఞ శిరసావహించడానికి ఉద్యుక్తుడు అవుతూ, "సీతా !! ఈ శాసనం నాకు మాత్రమే వర్తిస్తుంది. నీవు నా వెంట వచ్చి అరణ్యవాస కష్టాలు అనుభవించవల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు" అని అనగా ఆ దేవి, "భర్త వెంట లేకపోవడమే తనకి అత్యంత దుర్భరమైన కఠిన శిక్ష" అని పేర్కొంటుంది. 

సీతా రాముల కళ్యాణం కమనీయం !! వారి దాంపత్యం ఆదర్శప్రాయం  !! ఇప్పటికి, ఎప్పటికి రామాయణ వైభవమే మనకి సదా పూజ్యనీయం !! రామాయణ వైభవం తలిచి, కొలిచి ఎందరో మహానుభావులు తరించారు. అన్నింటి కన్నా ముక్ష్యంగా రామ నామ పారాయణంనకు  మంగళ ప్రదుడైన హనుమ మన వెంటే ఉంటాడు. 

యత్రః యత్రః  రఘునాదః కీర్తనం 
తత్రః తత్రః క్రుతమస్తః కాంజలీమ్ 

రామ నామం మానవ జీవితాల్లో ఎంతగా ఇమిడీ కృతం అయ్యిందంటే,  మన పేర్ల్లల్లో  రామ నామం చేరుస్తాం, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముడినే తలుస్తాం, మన సంప్రదాయం ప్రకారం వివాహ శుభ పత్రికల్లో కూడా ఆ నాటి సీత రామ తలంబ్రాలే ఆ కొత్త జంటకి ఆశీర్వాదం కావాలన్నా తలంపు తోనే

జానక్యః కమలాంజలి పుటేయః పద్మరాగాయితః 
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితః 
స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్ర నీలయితః 
ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికః 

అన్న శ్లోకం ముద్రిస్తాం . ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా ధన్య వాదాలు తెలుపుతూ, ఆ రామానుగ్రహం  మన అందరి పైనా సదా ఉండాలి అని కోరూతూ "సర్వే జనః సుఖినో భవంతు", "జై శ్రీ రామ్"

Tuesday, July 12, 2016

చక్ర భ్రమణం

సరోజా ! ఇది చూసావా.. ఈ రోజు ఉష్ణోగ్రత వివరాలు - 44 c.. ఇంకేముంది! దుంప తెగిందన్న మాటే !

అయ్యా బాబోయ్! ఇంకా రోహిణి కార్తె చూస్తే కనీశం నెల పైనే ఉంది. రాను పోను, మొత్తం ఆరు కిలోమీటర్లు, కాలి నడక ! ఎట్లా నెగ్గుకొస్తారో ఏమిటో !

ఎట్లా ఏముంది..  ఉద్యోగం అన్నాక తప్పుతుందా! పోనీ ఎండ ఒక్కటి అనుకొంటే పర్వాలేదు.. సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయినా కూడా వాడ గాల్పులాయే!

పోనీ సైకిల్ ఒకటి తీసికోరాదండీ.. హంబరో, హీరో నో ?

తీసికొంటే, బావుంటుంది కానీ, మనకి వచ్చే జానా బెత్తడు జీతానికి, ఉన్న పళాన వెయ్యి రూపాయల  ఖర్చు అంటే మాటలా? పోనీ సెకండ్ హ్యాండ్ తీసుకొందామంటే, ఎవరినో మోసిన ఇనప సామాను మన ఇంటికి ఎందుకంటావ్..

అయిందిగా ఆ ముచ్చట కూడా! మీ బావ 15 ఏళ్ల నాటి అంటగట్టిన సైకిల్ ఒక్క మూడు నెలలు వాడారో లేదో, పాత ఇనప సామాన్ల వాడు కూడా ఛీ పొమ్మంటున్నాడు.

 ఇది ఇప్పట్లో తెమిలేది కాదులే. ఈ వేసవి కాలం ఎలాగోలా నడపాల్సిందే.. 

దాదాపు నలభై ఏళ్ల క్రిందటి మాట! రామారావు బెజవాడ లో ఒక ఆడిటర్ గారి ఆఫీస్ లో గుమస్తా. వరసే కదా అని దూరపు చుట్టాలమ్మాయిని చేసికొన్నా, సరోజ అందం, అణుకువలకి అత్యంత ముగ్దుడైన రామరావు చాలా దగ్గరగానే సంసారం చేయసాగాడు. ఎంత దగ్గరగా అంటే, పెళ్ళైన సంవత్సరం తిరక్కుండానే, అదృష్టం ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించింది. "లక్ష్మీ దేవోయ్, రామరావ్! ఇంక నీకు తిరుగు లేదంటే నమ్ము!", అని పిల్లని చూట్టానికి వచ్చిన పైన మామ గారు సెలవిస్తే, శుక్రవారాలు తలుపు దగ్గరగా కూడా వెయ్య రాదని సరోజ కి స్త్రిక్ట్ వార్ణింగ్ ఇచ్చాడు. పిల్ల పుట్టడం తో కొద్దీ పాటి ఎడబాటు సంభవించినా, భర్త బాధ్యతలని ఏనాడు రామ రావు విస్మరించక పోవడంతో, మిగతా ఏడుగురు లక్ష్మీల మాట ఎట్లా ఉన్నా, సంతాన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించడంతో, మరో ఇద్దరు మగ పిల్లల ఇట్టే పుట్టడం, రామరావు "కుటుంబ రావు" గా పరివర్తనం చెందడం ఇట్టే జరిగి పోయాయి. 

రామారావు స్వతహాగా తెలివైన వాడు. బండెడు సంసారం మరియు ఇతరత్రా కుటుంబ కారణాల రీత్యా,  వాళ్ళ నాన్న పదో తరగతి దాటగానే, ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అన్నయ్యల దెగ్గర చేరి, ఇంకో రెండు సంవత్సరాలు బండి లాగించాడు రామ రావు. ఈ క్రమంలో, తెలిసిన బంధువులాయన దగ్గర అకౌంట్స్ చూడడం, పన్నుల కి సంబందించిన వ్యవహారాల్లో కొద్దో గొప్పో, రాణింపుసంపాదించుకున్నాడు. తర్వాత, ఇంక నా వల్ల కాదురా అని రామ రావు ని అదే ఊర్లో ఉన్న ఆడిటర్ గారి దగ్గర లెక్కలు చూసే పనిలో పెట్టేసాడు.  ఈ క్రమంలో రామరావు చురుకు, ఉత్సాహం చూసి నచ్చిన ఆ ఆడిటర్ గారు, నెమ్మదిగా కొంచెం పేరు ఉన్న వ్యాపారస్తుల అకౌంట్స్ చూడమని పురమాయించాడు. పేరుకు "రాముడైనా", మనస్తత్వం అంతా ఆంజనేయుడవటం, అతి కొద్దీ కాలం లోనే యజమాని నమ్మకాన్నిచూరగొని, హెడ్ గుమస్తా గా ప్రమోషన్ రావడం, తన కింద ఇంకో ఇద్దరు గుమస్తా లను నియమించడం ఇట్టే జరిగి పోయాయి. మరీ డిగ్రీ అయినా లేకపోతే ఎం బావుంటుంది అని, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రైవేట్ గా B.COM పూర్తి చేసాడు. గవర్మెంట్ ఉద్యోగం కాదనే కానీ, రామరావు పని చేసే సంస్థ వారికి  మిగతా వ్యాపారాలు కూడా ఉండడం తో అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతి నిండా పనే.  

"అసలే ప్లస్ లో ఉన్నావ్! పైగా జీతం కూడా పెరిగింది.. నక్కని తొక్కావురా రామారావ్!", అంటూ నెల్లూరు నించి కాకినాడ ప్రయాణం చేస్తూ ఊరు మీదుగా వెళ్తూ ఆగి పలకరించక పోతే ఏమి బావుంటుందని ఆగిన బాబాయ్ వరుస అయ్యే బంధువు ఇచ్చిన కితాబు. "ఎం ప్లస్సో బాబాయ్! ఈ సంసారరధచక్రాలు లాగడం అంటే మాటలు కాదు. గత అయిదు సంవత్సరాల్లో,  గానుగెద్దు తిరిగినట్టు ఆఫీస్ నించి ఇంటికి, ఇంటి నించి ఆఫీస్ కి ఎండైనా, వానైనా కాలి నడక తప్పట్లేదు కదా. ఒక్క సైకిల్ కొనుక్కొందామంటే, ఏదీ..", అంటూ వాపోయాడు రామారావు. "ఏమి చేస్తాం నాయనా, త్రేతా యుగంలో శ్రీ రాముడికే తప్పలేదు ఈ సంసార ఈతి బాధలు, కలియుగం లో రామరావు మాత్రం తప్పించమంటే ఎట్లా", అంటూ  తన బండి టైం అవ్వడం తో బయలుదేరాడు. 

చూస్తూనే పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టారు. రామరావు నడవటం అన్నా, నడవక్కర లేకుండా గమ్యం చేరే సమస్త చరా చర ప్రాణి కోటి అన్నా తెలియని ద్వేషం పెంచుకున్నాడు. "ఆహా! మనం కూడా భూ కైలాష్ సినిమా లో నారదుడికి మల్లె ఆకాశ మార్గం లో ప్రయాణిస్తే ఎంత బావుంటుందో కదా.. వెదవ పిచ్చుక ఒక చోటి నించి ఇంకో చోటికి ఎంత హాయి గా ఎగురుతోందో కదా..", ఇలా సాగేవి అతని ఆలోచనలు రోజు తనకి తప్పని నడక ప్రయాణంలో. పోనీ ధరించి సైకిల్ కొందామంటే, ప్రతి సంవత్సరం పెరిగే యాబయ్యో, వందో జీతం తో పాటు ఇంటి ఖర్చులు ఇంకొంచం పై చెయ్యి కావడం తో బొటాబోటిగా సరి పోయేది. ఎప్పుడైనా, పండక్కో లేదా యజమాని ఇంట్లో శుభ కార్యాలకో లభించే అదనపు ఆదాయం, భార్య పిల్లలకి బట్టలు కొనగా మిగిలే అనిర్వచనీయమైన సంతోషానికి సాక్షీ భూతం గా నిలబడి, తన కష్టాన్ని తనలోనే అణుచుకొనే వాడు. 

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా, ఎండా కాలం లో మాత్రం నెట్టి మీద ఒక రుమాలు గుడ్డ కట్టుకొని నడవాలంటే అంతంత దూరం నడవాలంటే ప్రాణం ఉసూరుమనేది. "ఈ నెలలో అయినా సైకిల్ కొనాల్సిందే", అని ఆ రోజుకి నలభై ఒకటో సారి గట్టిగా తనకి తాను చెప్పు కొన్నాడు. అందులోనూ క్రితం రోజు రాత్రి "installments లో అయినా వెధవ సైకిల్ ఒకటి కొందామండీ" అంటూ భార్య ఊతం కూడా రామ రావు దృఢ నిర్ణయానికి కారణ భూతం అయిందేమో.  మొత్తానికి రాబోయే ఆదివారంకి శుభ ముహూర్తం నిర్ణయించుకున్నారు, భార్యా భర్తలిద్దరూ. శనివారం ఒన్ తౌన్ లో ఉన్న సైకిల్ షాప్ కి వెళ్లి ఇంస్టాల్మెంట్ వివరాలు అన్నీ వాకబు చేసి ఇంటికి చేరే టప్పటికి, ఇంటి నిండా పండగ వాతావరణం కనిపించింది. కొంచం ఎడమ కన్ను అదురుతున్నప్పటికిన్నీ గుండె దిటవు చేసికొని, సరోజ ఇచ్చిన కూజా నీళ్లతో గొంతు తడుపుతుండగా, "ఏమండీ విన్నారా ? మా పెదనాన్న గారి అబ్బాయి, అదేనండి మా అమెరికా అన్నయ్య రేపు మన ఇంటికి వస్తున్నారట !! ఈ రోజే కబురొచ్చింది" అంటూ ఉబ్బి తబ్బిబ్బు అవుతూ చెప్పింది. ఎప్పుడో పెళ్లి నాటికి చూశాడాయన్ని రామ రావు. "సరే అంత పెద్ద హోదా గల వాళ్ళు మనని  గుర్తు పెట్టుకొని మరీ వస్తున్నారంటే ఆనందించ దగ్గ విషయమే కానీ, "దీనికి నా సైకిల్ కి ఏమైనా లింక్ ఉందా" అని గునిసాడు. "మరి ఎం చేస్తాం, చెప్పండి? రాక రాక మన ఇంటికి వస్తున్నారాయె. వస్తూ పిల్లలికి ఏదో ఒకటి  తేక పోరు. ఏదో మన స్తాయి లో వాళ్ళ పిల్లలికి బట్టలయినా ఇవ్వక పోతే ఎలా చెప్పండి?", అంటూ అనునయనంగా చెప్పింది సరోజ. సరే, తప్పుతుందా అనుకొంటూ, సైకిల్ అడ్వాన్సు కోసం పక్కన పెట్టిన డబ్బుతో , సరోజ చెప్పిన వస్తువులు కొనడంతో నిమగ్నం అయ్యాడు. వచ్చిన చుట్టాలతో అమెరికా విశేషాలు మాట్లాడుతూ ఉండగా రామారావు ఏదో సందర్భంలో, "ఏమండీ ! మీ దేశం లో ఖాళీ సమయాల్లో ఏమి చేస్తూ ఉంటారండీ", అని అడిగాడు. "ఖాళీ ఎక్కడండీ ? అమెరికా లో ప్రతి నిమిషం విలువైనదే నండీ! కానీ రోజు సాయంత్రాల్లో మాత్రం, నేను నా భార్య కనీసం ఒక్క అర గంట అయినా నడుస్తూ ఉంటాం. వ్యాయాయం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదండీ", అనగానే భార్యా భర్తలు ఇద్దరూ మోహా మొహాలు చూసుకొన్నారు. రామా రావు కి మళ్ళీ నడక కష్టాలు తప్పలేదు.

కానీ రోజులు అన్నీ ఒకే మాదిరి గా ఉండవు కదా. మారే ప్రపంచ పరిస్థితులతో పాటుగా భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా పగ్గాలు విడిచిన రేసు గుర్రం లాగా పరిగెత్తడం మొదలు పెట్టింది. రామారావు ఎంత పని ఒత్తిడి ఉన్నా, C.A పరీక్షలు పట్టు పట్టి పాస్ అయ్యాడు. అసలే అకౌంట్స్ మరియు పన్నుల వ్యవహారాలులో మంచి అనుభవం గడించిన వాడు అవ్వడం మూలాన, అతనికి అంటూ ప్రాక్టీస్ ఏర్పడడం పెద్ద కష్టం అవ్వలేదు. అదృష్ట వశాత్తూ పిల్లలు ముగ్గురూ ఆణి ముత్యాలుకి మల్లె చదువు లోనూ, గుణము లోనూ ఎవ్వరికీ తీసిపోని విధంగా నిలబడ్డారు. అమ్మాయి ఈ మాత్రం కోచింగ్ అవసరమే లేకుండా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ సంపాదించింది. మొగ పిల్లలు ఇద్దరూ అమ్మాయి అంత కాక పోయినా గవెర్నమెంట్ కాలేజ్ లోనే సీట్లు సంపాదించారు. "లక్షలకి లక్షలు గుమ్మరిస్తే  ఏమి లాభం! స్వతహాగా మెరిట్ ఉండాలండి. మా పిల్లలని చూడండి, అందరికి బ్రహ్మ ప్రళయం అయిన సీట్లు ఇట్టే సంపాదించేసారు", అని అడిగిన వాడికి అడగని వాడికి చెప్పసాగాడు. "ఊరుకోండి! మీరు మరీనూ! పిల్లలకి దిష్టి తగులుతుంది", అంటూ సరోజ ఉప్పు డబ్బాలు కరిగించేసింది.

తన ప్రాక్టీస్ లో గణనీయంగా పెరుగుదల  ఉండడంతో, సైకిల్ కె గతి లేని రామ రావు, ఉన్న పళాన పెద్ద కష్టపడకుండా స్కూటరే కొనేసాడు. సరోజ  చుట్టూ పక్కల వాళ్ళ అందరికి ఒక చిన్న పాటి తేనీటి విందు ఏర్పాటు చేసింది. "మా వారికి వాహన యోగం చిరకాల వాంఛ అండీ. ఇన్నాళ్లకి నెరవేరింది" ఆంటూ తెగ మురుసుకు పోయింది. గుళ్లో పూజారి నిమ్మకాయలు మీదుగా స్కూటర్ నడప మన్నప్పుడు మొదలు రామ రావు నడక అన్న పదానికి దాదాపు స్వస్తి పలికాడు. వీధి చివర ఉన్న కిరాణా కొట్టు కి వెళ్లాలన్నా స్కూటర్ కె పని చెప్పేవాడు.

భార్యా భర్తల పూర్వ జన్మ సుకృతమో ఏమో, అమ్మాయి తన కాలేజ్ లోనే చదువుకొన్న మరో డాక్టర్ అబ్బాయి తో కాణీ కట్నం లేకుండా పెళ్లి జరిగింది. అబ్బాయిలు ఇద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. రామారావు ఉద్యోగ పెరుగుదల తో పాటు, పిల్లలు ముగ్గురూ చేతికి అందిరావడం తో ఒక శుభ మూహూర్తాన మూడు వందల గజాల స్థలంలో లోను తీసికొని చక్కటి ఇల్లు కూడా కట్టుకోగలిగాడు. అమ్మాయి, అల్లుడు స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి ఊళ్ళో మంచి హస్త వాసి గల డాక్టర్ల గా పేరు పొందారు. మొగ పిల్లలు ఇద్దరూ వాళ్ళు పని చేసే కంపెనీలలోనే అవకాశం రావడంతో అమెరికా లో స్థిర పడ్డారు. "ఇంకా, ఆ డొక్కు స్కూటర్ ఏమి నడుపుతావు నాన్న! మంచి కార్ కొనుక్కో అని పెద్దవాడు ఒక A.C కార్ కొని పెట్టాడు. ఎండా కాలం ఏమీ అవస్థ లేకుండా చిన్న వాడు ఇంట్లో అన్ని గదుల్లో A.C పెట్టించాడు.

ఇప్పుడు సరోజకి ప్రొద్దునే వంటకి ఒక మనిషి, ఇంటి పనులు చేయడానికి నమ్మకమైన పని మనుషులు స్థిర పడ్డారు. ఇంకా ఏ మాత్రం కష్ష్ట పడద్దు అంటూ పిల్లలు వాషింగ్ మిషన్లు, డబుల్ డోర్ ఫ్రిడ్జిలు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ లు సమస్తం అమర్చారు. సరోజ, రామ రావు లు క్రమ క్రమం గా "సరోజమ్మ గారు, రావు గారు" గా పరి వర్తన చెందారు. ఎప్పుడూ బక్క పలచగా ఉండే రామ రావు కొంచం రంగది వచ్చి ఒళ్ళు కూడా చేసాడు. వయస్సు కి తగినంత పొట్ట కూడా వచ్చి, తన హై క్లాస్ మిత్రులతో అప్పుడప్పుడు ఇంకా కొంచం ఒళ్ళు చేయడానికి దోహద పడే బీర్, స్కాచ్  వంటి అలవాట్లు కూడా  సంక్రమించాయి. రోజూ అలవాటు గా దైనందిక సీరియళ్లు అన్నీ ముగించు కొని పదుకొనె ముందు న్యూస్ ఛానెల్స్ లో ప్రపంచంలో సామాన్యుడికి అవసరం లేని విషయాల పైన తీవ్రమైన చర్చలన్నింటి లోనూ  లీనమై, కొన్ని మంచి పాయింట్స్ రేపటి క్లబ్ లో మిత్రులతో పంచు కోవడానికి బాగా మననం చేసికొని పడుకొన్నాడు. కొంచం మగత గా నిద్ర పడుతూ ఉండగా, కొంచం గుండెల్లో భారం గా అనిపించడం మొదలు అయ్యింది. ఏంటో అర్ధం గాక భార్య ని లేపుదామా అనుకొంటూనే, "ఎందుకులే కంగారు పడుతుంది, అదే తగ్గుతుంది లే, కొంచం సేపు చూద్దాం" అని అనుకొన్నాడు.. ఏ తెల్ల వారు జామునో, రాత్రంతా అటు ఇటు దొర్లుతున్న రామ రావు ఇంక లాభం లేదు అనుకోని సరోజని నిద్ర లేపి హాస్పిటల్ కి  తీసికెళ్ళమని చెప్పాడు.

వెంటనే, ఊళ్ళో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి చేరిన రామ రావు కి, వైద్య శాస్త్రం లో ఉన్న అన్ని రకాల టెస్ట్స్ చేసిన తర్వాత, వార్త విని హూటా హూటా న పరిగెత్తుకొచ్చిన అమ్మాయి తో చీఫ్ డాక్టర్ ఇలా చెప్పాడు. "ఎం లేదమ్మా!! నీకు తెలియంది ఏముంది. ఒంట్లో కొవ్వు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. ఒక నాలుగు రోజులు ఆబ్సెర్వేషన్ లో ఉంచి పంపిస్తాం", అంటూ రామ రావు వంక తిరిగి, "రావు గారు! తిండి లో ఉప్పు కారం పూర్తిగా తగ్గించేయాలి. ఇంక నించి రోజూ కనీశం నాలుగైదు కిలోమీటర్లు నడవాలండీ. పాపం మీకు నడక అలవాటు ఉందొ లేదో! కానీ తప్పదు అలవాటు చేసికోవాల్సిందే", అని పక్క రూం లో ఉన్న పేషంట్ ని చూడ్డానికి కదిలాడు.

రచయిత :  గతంలో మధ్య తరగతి కుటుంబాల్లో అదనంగా ఒక వస్తువు కొనాలంటే దాదాపు బ్రహ్మ ప్రళయమే !! టి వి, సైకిల్, పట్టు చీర ఇలాంటి వస్తువు కొనాలంటే వాళ్ళు పడే ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. మారిన పరిస్తుతుల రీత్యా వస్తు సమీకరణ సులభతరం అయినా, వారి జీవితాల్లో వాటి స్తానం లో ఇతరత్రా సమస్యలు చోటు చేసికొన్నాయన్న సందేశం కోసం చేసిన  చిరు ప్రయత్నం 

Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు 

Wednesday, October 23, 2013

సచిన్ శకం

  • ఈ బొంబాయి కుర్రాడికి 16 సంవత్సరాలే అట !!
  • గవాస్కర్, విశ్వనాథ్ వీళ్ళు ఎవరు పనికి రారు అట !!
  • దొంగ వెధవలు !! చిన్న పిల్ల వాడు అని కూడా చూడ కుండా చూడండీ.. పాపం రక్తం ముక్కు నించి !!
  • మూడు సిక్సర్లు, ఒక్క ఓవర్ లో !! ఖాదిర్ గాడి మొహం చూడాలి !!
  • ఏంటీ వరల్డ్ రికార్డా !! ఇంత కన్నా చిన్న వాడు ఎవడయిన టెస్ట్ సెంచరీ కొట్టాడా?
  • వన్ డే లో ఓపెనర్ గా ఇరగ దీశాడు గా !! 49 బాల్స్ లో 82..
  • సరే నయ్య !! అసలు వన్ డే లో సెంచరీ కొడతాడ అని !!
  • మొత్తానికి 79 మాచేస్ ఆడితే ఒక్క సెంచరీ కొట్టాడు అండీ!!
  • ఇసుకతుఫాన్ వచ్చింది అంటే నమ్మండి !! స్టీవ్ వా గాడి మొహం చూడాలి !!
  • బాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నీ ఒక్కడే చెయ్యాలి అంటే కష్టమే మరి !! అయినా ఏమీ చేస్తాడు అండీ మిగతా వాళ్ళు దండగ మారిన వెధవలు అయితే !!
  • అన్యాయం గా అఖ్తర్ గాడు సచిన్ ని అవుట్ చేసాడు అండీ !! కొంచం నీతి జాతి ఉంటె మళ్లీ వెనక్కి పిలిచి ఉండే వాళ్ళు !!
  • చెన్నై లో పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ 
    • కష్ట పడి 136 కొట్టాడు కాని పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిపించ లేక పోయాడు అండీ !! అయినా సచిన్ సెంచరీ చేస్తీ ...
    • నోరు ముయ్యి !! విపరీతమైన బ్యాక్ పైన్ పాపం !! అయినా సచిన్ ని అనే వాడివి అయ్యావా ?? ఎంత ధైర్యం ??
  • కెప్టెన్  గా పనికి రాడండీ !! అబ్బే లాభం లేదు !!
  • సచిన్ భార్య అయిదు సంవత్సరాలు పెద్దది అటగా??
  • సచిన్ నాన్న చని పోయాడు. 
    • పాపం అండీ !! మన సచిన్ వాళ్ళ నాన్న చని పోయాడు అట 
    • అయితే, దేశం కోసం అడాల్సిన వరల్డ్ కప్ మధ్యలో ఇంటికి వస్తాడ?
    • వాళ్ళ అమ్మ చూడండీ !! అదే మాట అతనితో చెప్పి మల్లి వెనక్కి పంపింది అట 
  • సచిన్ ఎల్బో ఇంజురీ 
    • సచిన్ పని అయిపొయింది !!
    • టెన్నిస్ ఎల్బో అని... పాపం అండీ !! ఎట్లా ఇండియా టీం ఇంక 
    • అబ్బే !! ఇక లాభం లేదు... ఇదివరకు లాగ అయితే ఆడలేడు 
  • లక్ష్మన్, ద్రావిడ్ ని చూడండి !! సచిన్ ఒక్క రోజు అయినా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడ ?
  • సచిన్ బ్రాండ్ అంబాసిడర్  అయి పోయాడు !! అంత డబ్బు కోసమే నండి.. ఈ హడావుడి అంతా 
  • వన్ డే డబల్ సెంచరీ 
    • అస్సలు ఊహించమా? మన లైఫ్ టైం జరుగుతుంది అని అనుకోలా 
    • సర్లే వయ్యా !! ఇంకో రికార్డు... అంతేగా !!
  • సచిన్ ఇంకా ఒక చిన్న డబల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ లో ఉంటాడు అట. నిజం గా గ్రేట్ అండీ 
  • పాకిస్తాన్ మీద చేల రేగి పోయాడు గా !! వరల్డ్ కప్ లో వాళ్ళ వాళ్ళ కాదు మన మీద గెలవడం !! ఇప్పటి దాక ఆడింది ఒక ఎత్తు, ఇప్పుడు కొట్టిన 95 ఒక ఎత్తు !!
  • సచిన్ కి భారత రత్న ఇవ్వాలి అండీ 
  • ఫైనల్ లో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ !! సచిన్ ఏమి పీకాడండి.. లారా, పాంటింగ్ చూడండీ !! ఇంపార్టెంట్ మ్యాచ్ లలో చెలరేగి పోతారు 
  • ఇంగ్లాండ్ మీద నాలగవ ఇన్నింగ్స్ లో సెంచరీ !! అందరి నోళ్ళు మూయించాడు గా !!
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా లో చూసారా !! పిచ్చ ఫారం లో ఉన్నాడుగా !! సెంచరీ మీద సెంచరీ 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా పిచ్ ల మీద సచిన్ ఒక్కడే ఇంత క్లాసు గా అడగలడు !! (లక్ష్మన్ కన్నానా)
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • మళ్లీ  వరల్డ్ కప్ వచ్చింది గా ?? సచిన్ దీని తర్వాత అయినా... 
  • మళ్ళీ వరల్డ్ కప్ లో మాక్సిమం రన్స్ సచినే 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • 30 సంవత్సరాలు అయిన తర్వాత, మొత్తానికి ఇండియా మళ్లీ వరల్డ్ కప్ నెగ్గారు కదా 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ప్రతి ఒక్క పిల్ల నాయాలు సచిన్ ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు ఈ మధ్య 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ వన్ డే నించి రిటైర్ అవుతున్నాడు అట 
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ రాజ్య సభ కి ఎంపీ గా అయ్యాడు అట !!  
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ ఇంకా క్రికెట్ ఆడడు అట.. అయ్యో !! ఇంకా చూడమా ఇంకా సచిన్ ని 
24 సంవత్సరాలు పాటు, తన చుట్టూ నోళ్ళు ఆడుతున్నా, తనని కాదు అని అన్నట్టు గా అతను తనకి తెల్సిన పని చేసికొంటూనే ఉన్నాడు.
ఒక సుశిక్షితుడైన సైనికుడు లాగ 
ఒక కర్తవ్య నిమగ్నుడైన కార్మికుడు  లాగ 
ఒక ఔత్సహికుడైన విద్యార్ధి లాగ 
ఒక నిజాయితి పరుడైన పౌరుడు లాగ 

Saturday, August 31, 2013

ఈ రోజు ముక్ష్యాంశాలు

 "హైదరాబాద్ లో ఉన్న వారంతా తెలంగాణ వారే" -  దామోదర  (జ్యోతి)
"హైదరాబాద్ అందరిది" - తెదేపా ఎమెల్యే లు (ఈనాడు)
"ఇంకా వెయ్యి ఏళ్ళు అయినా హైదరాబాద్ సీమంధ్ర వాళ్ళది అవదు" - హరీష్(జ్యోతి)
"హైదరాబాద్ లో సభ జరిపే హక్కు సీమాంధ్రులకు లేదు" - నాగం (జ్యోతి)
"రాజ్యాంగ బద్దం గా ఎవరు అయినా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు" - డి ఎస్ (జ్యోతి)
"సీమాంధ్ర వాదనలో న్యాయం ఉంది" - చంద్రబాబు (ఈనాడు)
 "తెలంగాణ రాష్ట్రం ఆపే శక్తి ఎవరికీ లేదు" - మధు యాష్కి(జ్యోతి)
 "తెలంగాణ ప్రక్రియ ని వేగవంతం చేయాలి" ఉద్యమ నిర్మాత నాయకులు (ఈనాడు)
"తెలంగాణ ని విభజించి ప్రభుత్వం తప్పు చేసింది"  మధు సూధన్ గుప్తా (సాక్షి)
"తల మొండెం వేరు చేయద్దు" - సచివాలయ ఉద్యోగులు (ఈనాడు)
"విభజిస్తే సీమంద్రకారం" - ఎవరో (సాక్షి)
"ముఖ్య మంత్రిది  అవకాశవాదం" - కోదండ రామ్ (ఈనాడు)
"జగన్ నిరాహార దీక్ష ఎందుకు ఎవరి కోసం" - మోత్కుపల్లి (జ్యోతి)
"ఏడు రోజుల దీక్షతో నీరశించిన జగన్" - నిమ్స్ వైద్యులు (సాక్షి)
"దీక్షలు బగ్నం చేసినా ప్రజల మధ్యనే ఉంటాం" - విజయమ్మ (సాక్షి)
"యాత్ర ఎందుకో చెప్పండి" - ఎ పీ ఎన్ జి ఓ సంఘం అద్యక్షుడు (ఈనాడు)

మాకు  స్కూల్ ఫంక్షన్ లో వార్తలు ని పేరడీ చేసి చదివే ప్రోగ్రాం ఒకటి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు అవి ప్రత్యేకం గా అక్కరలేదు అనుకొంటా. తెలుగు వాడికి విస్తర్లో అమ్మ (తెలంగాణ తల్లి అయినా, తెలుగు తల్లి అయినా) అన్నీ పెట్టినా, అవకాయో లేక గొంగురో లేదు అని అక్షేపిస్తాడు అట. తెలుగు పేపర్లలో, టీవీ ల్లో గత నాలుగు సంవత్సరాల నించి రకరకాల పచ్చడ్ల పండగే. కాకా పొతే తిని తిని (విని చదవి) కడుపు నెప్పి ఎక్కువ అయినట్టు ఉన్ది.





Sunday, August 11, 2013

ధర్మాచరణ

మనం ఇది చాల సందర్భాల్లో వింటూ ఉంటాము. యుద్ధం లో సైనికుడు ఒక శత్రువుని మరియు ఒక పచ్చి ఉన్మాది మానవత్వం ఊహించని విధంగా అన్నెం పున్నెం తెలియని అమాయకులని చంపడాన్ని రెండింటిని "హత్య" అని అనడం లెదు. మొదటిది కర్తవ్యమ్ అయ్యి ఆ దేశ ప్రజలచే కొనియాడ బడితే రెండో దాన్ని అత్యంత హేయమైన కిరాతకం గా చిత్రీకరించ బడుతుంది. ఒకటి వృత్తి ధర్మం అయితే రెండవది అధర్మం అంటున్నారు.

రామాయణం లోని అరణ్య కాండ లో శ్రీ రాముడు భరద్వాజ ఆశ్రమం లో సీతా లక్ష్మణ సహేతుడై ముని ని తన ఆశ్రమ నిర్మాణానికి ఒక అనువైన ప్రదేశం సూచించ మని అడుగుతాడు. ఆయనే శ్రీ మహా విష్ణుడిగా గుర్తు ఎరిగిన మహర్షి రాముడిని అక్కడే అరణ్యవాసం చేయమని కోరతాడు. దానికి శ్రీ రామ చంద్రుడు, సున్నితంగా నిరాకరిస్తూ తన ధర్మం ఋషులతో గడపడానికి సమ్మతించదని చెప్పి నిరాకరిస్తాడు. పైగా ఒక ఉదాహరణ చెపుతూ మీ ఆశ్రమం లో ఉండే సాదు జంతువులని క్రూర మృగాల నించి రక్షించే క్రమం లో నేను వాటిని సంహరించి నప్పుడు, మీ మనస్సులు ఏ  సందర్భం లో అయినా కష్టం కలిగి నాకు అకారణ శాపంనకు కూడా కారణం అవచ్చు అని చెపుతాడు. నిజంగానే అన్ని భూతాల్లో ఒకే పర బ్రహ్మం ని దర్శించే స్తాయి మహర్షికి ఉందని అదే ధర్మాన్ని దుష్ట శిక్షణ నిమిత్తమై వచ్చిన రాముడు పాటిస్తే అవతార ప్రయోజనం నేరవేర్చేది ఎలా?

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.మత సంప్రదాయాల్లో పాటింపులు మరియు  పట్టింపులు వల్ల ఒకడిని ఒకడు కొన్ని వేల సంవత్సరాలు పాటు ద్వేషిస్తూనే ఉండటం దాని వల్ల చరిత్ర లో అతి దారుణమైన యుద్దాలు... అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మరి అందరికి ధర్మ పరిశీలన చేయడం కుదురుతుందా?

ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. మదర్ తెరిస్సా తనకి ముక్కు మొహం తెలియని వాళ్లకి వచ్చి ఏ మాత్రం స్వార్ధం లేకుండా తన జీవిత కాలం సేవ చేసినది. విశ్వా మిత్రుడు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన "గాయత్రీ" మహా మంత్రాన్ని మానవాళి బుద్ది సక్రమం గా ప్రచోదనం చేసికొనే అవకాశాన్ని కలిగించి ఈ విశ్వానికి "మిత్రుడు" అయ్యాడు.ఇక్కడ ధర్మంని ధర్మం గానే దర్శించ వచ్చు.

కొన్ని సందర్భాల్లో ధర్మం సామాన్య ప్రజలకి అధర్మం గా కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ షిర్డీ సాయిబాబా హైందవ సనాతన ధర్మం లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వైదిక సంస్కృతి కి కట్టుబడి ప్రవర్తించినట్టు గా దాకలాలు లెవు. అనగా అయన ఈ కట్టుబాట్లకు అతీతుడు. అదే విధంగా శ్రీ కృష్ణుని బాల్యం లో అంతా చోర లీలలు గురించి భాగవతం లో చూస్తే, మన లాంటి వాళ్ళు అనుకరణ సాధ్యం కాని విధంగా ఉంటుంది. అనగా జ్ఞాని ని అనుకరిస్తే సామాన్యుల విషయంలో అది అధర్మంగా పరిగణింప పడుతుంది.

ఇంకొన్ని సార్లు, అధర్మ ప్రవర్తన బయటి ప్రపంచానికి ఉత్తమ మైన ధర్మం గా కనపడే అవకాశం ఉంది. మనం చాల మంది దొంగ సన్యాశులను చూస్తూ ఉంటాం. బయట ఎన్నో ధర్మ పన్నాలు చెపుతున్నా, అంతర్ముఖంలో బహు కుతంత్రాలు కుటిల నీతులు మాయం తో వారి జీవన పయనం ఉంటుంది. వీళ్ళతో చాల ప్రమాదం సమాజానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక పొతే అధర్మ ప్రవర్తన ఉండే అధర్మ పరులు గుర్తించడం కొంచం సులభమే అనుకొంటా.

మరి ధర్మ పరిశీలన ఇంత సంక్లిష్టం అయినప్పుడు తప్పొప్పులను ఎంచడం మన లాంటి వాళ్లకు సాధ్యమా? అలాగే జీవిత పర్యంతం తన ధర్మాన్ని ఎరిగి ఆచరణ చేయడం అంత సులభమైన విషయమా? మనం చాల మంది అంటూ ఉండడం చూస్తూ ఉంటాము. నాకు నా పరిధి లో నేను సక్రమం గా ఉంటె సరి పోదా అని. నిజంగా మనం అంత వరకు ఎటువంటి అంతర్మధన కు గురి కాకుండా సక్రమం గా విధి నిర్వహణ చేయ గలమా? ఎందుకు మన ధర్మం మన జీవన స్తితి ని బట్టి మరూతూ ఉంటుంది కదా. కొడుకు గా, తమ్ముడిగా, అన్నయ్య, భర్త గా, చెల్లెలు, అక్క, తల్లి, తండ్రి, స్నేహితుడు, పరిచయస్తుడు ఇట్లా రక రకాల స్తాయిల్లో రక రకాలు గా.

ఉదాహరణకి, యుధిస్టరుడు మొత్తం భారతం సర్వ పాత్రల్లో ధర్మానికి ప్రతీకగా చెపుతారు కదా. అయన ఎంత ధర్మానికి కట్టుబడ్డాడు అంటే, అజ్ఞాత వాశం ఉత్తర గోగ్రహణం లో అర్జనుడు బయటపడి పోయినప్పుడు, పాండవులు నిజం గా గడువు సక్రమం గా పూర్తి చేసారా లేదా అన్న మీమాంశ వస్తుంది. సరే యుద్ద భూమిలో ద్రోణ, భీష్మ మాటలు వినక తప్పక యుద్ధం కొనశాగించి అర్జనుని చేతిలో అవమానిమ్పబడిన కౌరవ రాజు కు భీష్మ పాండవ పక్షపాతి అని అనుమానం వీడక ఒక వేగు ని పిలిచి "ధర్మ రాజుని" ఈ సమస్య పై నివృత్తి ని కోరమని అడుగుతాడు. అంటే ధర్మ రాజు నిజం గా గడువు పూర్తి అయ్యింది అంటే, దుర్యోధనుడు ఇంక పై దాని గురుంచి ఆలోచించడు.అటువంటి ధర్మ వేత్త మరి భార్య ని అధర్మంగా పందెం లో ఒడ్డాడే అని మనకి అనిపించక మానదు. ధర్మ రాజు తాను ఓడాక భార్య ఒడ్దే అధికారం ఉంటుందా? అసలు భార్య ను పందెంలో ఒడ్డే అధికారం భర్త కి ఉంటుందా? కాని ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మ రాజు అసలు తన్ను పందెంలో ఒడ్దే అవకాశమే లేదు అని పూర్తి గా నమ్మి నేను "ధర్మ" విజితనా లేక "అధర్మ" విజిత నా అని సభని ప్రశ్నిస్తుంది. తెలిసినా చెప్పితే కురు వంశం ఏమి అవుతుందో అని  భయ పడ్డ భీష్ముడు ఆ ప్రశ్న దాటి వేస్తాడు. వివరించిన వికర్ణుడిని స్తాయి లేదని కర్ణుడు నిలువరిస్తాడు. అసలు సర్వ స్వతంత్రుడై జూదం ఆడుతున్న ధర్మ రాజు ద్రౌపది ని పందెంలో పణంగా పెట్టనే లెదు. తన అధీనంలో ఉన్న రాజ్యాలని, సంపదని, తమ్ముళ్ళని చివరకి తన్ని పందెంలో ఒడ్డి కౌరవ రాజు అయిన దుర్యోధనునకు బానిస అవుతాడు. అప్పటి వరకు దుర్యోధనుని ప్రతినిధిగా జూదం ఆడుతున్న శకుని ఆజ్ఞ మేరకు ద్రౌపది ని చివరగా పందెం లో ఒడ్డుతాడు. ఆ సమయంలో శకుని ద్రౌపది నే కాదు మరి ఎవరి ని పందెంలో ఒడ్డమన్నా అతను ఆజ్ఞ పాలించవలసిందే. అతంక ముందు వరకు ధర్మ రాజు "రాజ" ధర్మం వహిస్తే ఆ తర్వాత "సేవక" ధర్మం పాటించాడు. సేవకుడి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలు చూసికొనే బాధ్యత యజమానిదె. ఒకవేళ తన్ని పందెంలో ఒడ్డే ముందర కనక ద్రౌపది ని ఒడ్డ మని శకుని సలహా ఇచ్చి అయన అది చేస్తే అప్పుడు ధర్మ రాజు అధర్మ పరుడో కాదో నిర్ణయించే అధికారం మనకి ఉండచ్చు.

మరి ఈ కత్తి మీద సాము లాంటి ధర్మాచరణ అందరికి సాధ్యమా? తన ధర్మాన్ని తను నిర్వత్తిస్తే భగవంతుడు హర్షిస్తాడా? స్వధర్మాన్ని పాలించే వాళ్ళకి సత్య దర్శనం కలిగి శోకం తొలుగు తుందా?  ఇదే ధర్మ రాజు యుద్ధం అయిన జరిగిన జన నష్టం ని చూసి విపరీతమైన శోకానికి గురి అవుతాడు. కాగ నిత్యం ధర్మ పరాయణుడైన అయన ఆ విధం గా శోకించడం చూడ లేక "కిమేకం దైవతం కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్నామానవా శుభం" అని భీష్ముడిని అడిగేలా చేసి అయన కి విష్ణు సహస్ర నామ స్త్రోత్ర సారము తద్వారా సత్య సందర్శనం కలిగేలా చేస్తాడు ఆ భగవానుడు.

మన స్వధర్మం మనం పాటించినప్పుడు, సంఘర్షణలు ఎదురు అయినా, దానిలో తప్పు ఒప్పులు ఆయనకే సమర్పించ గలిగి నప్పుడు ఆయనే భాద్యత వహించి మన్ని తరింప చేయ గలడు అన్నది ఇక్కడ మనకి అర్ధం అవుతుంది.

*** కొంత మంది మహాను భావులు చెప్పిన ఒకటి అరా మంచి మాటల సారాన్ని అక్కడ ఇక్కడ జోడించి రాసిన వ్యాక్యాలు ఇవి. అంతే కాని నేను ఇంత గంభీర మైన విషయాలు గురించి వ్రాసేంత ప్రాజ్ఞుడిని కాదు మరియు అర్హుడిని అంత కన్నా కానే కాదు.