Thursday, June 25, 2020

Father's Day

మునపటికి చాన్నాళ్ల క్రితం సత్య లోకంలో  మన బ్రహ్మ గారు  ఒక రోజు కొలువై ఉన్నప్పుడు  సరస్వతీ దేవి వీణ శృతి సరి చేసుకొంటూ, "రోజూ ఈయన గారి వాహనం హంసధ్వని రాగాలాపనేనా, కొంచం వెరైటీ గా ఉంటుంది, కదనకుతూహలం ట్రై చేద్దాం" అనుకొంది.  అమ్మవారి ఈ మానససంచలనానికి రవ్వంత ఉలిక్కిపడిన బ్రహ్మ గారు, ఎందుకొచ్చిన గొడవలే అనుకోని, తన సృష్టి కార్యక్రమంలో భాగంగా, చేసినవన్నీ సత్కర్మలే అయినా, కొద్దిగా ఋషి ఋణం బకాయిపడిన సంధర్భంవల్ల, ఒక జీవిని భూలోకం పంపే ప్రయత్నంలో పడ్డారు. వాడు ఉన్నవాడు ఉండక, "స్వామి, ఇంత కాలం హాయిగా సత్య లోకంలో వేళకి తింటూ పడుకొంటూ, అమ్మ వీణాగానశ్రవణం చేస్తూ మీఇరువురి సంరక్షణలో ఇలా కాలం వెళ్ళబుస్తున్నాను. అసలే ఇప్పడు కరోనా అనే మహమ్మారి మరియు దాని మిత్రగణాలు పలు వేరియంట్ రూపధారులై స్వైర విహారం చేస్తున్న సమయం లో ఇప్పుడు భూలోకం పంపించడం ఏమైనా న్యాయంగా ఉందా", అంటూ దీనవదనంతో అడిగిన ఆ జీవికి, బ్రహ్మ ఇలా సెలవిచ్చాడు. "చూడు నాయనా, దేవుడు అన్నిచోట్లా ఉండడం సాధ్యం కాదనే, అమ్మ ని సృష్టించాడు. ఆ అమ్మ సంరక్షణలో, నీవు నిశ్చింత గా భూలోకంలో కాలం వెళ్ళబుచ్చవచ్చు", అని ఆ మధ్య  మదర్స్ డే సందర్భంగా విష్ణుమూర్తి పంపిన వాట్సాప్ మెసెజ్  గుర్తు తెచ్చుకొని చెప్పాడు. ఈ దెబ్బతో, సరస్వతి దేవి కూడా ట్యూన్ మార్చి మళ్ళీ హంసధ్వని రాగం ఆలాపన మొదలయ్యేటప్పటికీ కొంచం మనస్సు కుదుట పడింది. అయితే, ఈ సన్నివేశం అంతా ప్రత్యక్షం గా చూసిన నారదుడు చాలా సంతుష్టుడై, వైకుంఠానికి నారాయణ నామస్మరణ చేసికొంటూ, "అయ్యా ! మాతృమూర్తి వైభవం గురించి బ్రహ్మ పలికిన పలుకులు మీతో మనవి చేస్తానని", కధా వృత్తాంతం అంతా వివరించాడు. ఇది అంతా సావధానంగా విన్న విష్ణుమూర్తి, "బావుందోయ్ నారదా !! మరి అయితే అదే బ్రహ్మ గారిని తల్లి దైవమైతే, తండ్రుల పరిస్థితి ఏంటని కనుక్కురా", అని ప్రేరేపించాడు". నారదుడు తిరుగుటపా లో మరల సత్య లోకానికి వచ్చి బ్రహ్మ దేవుడికి ఈ ప్రశ్నని విన్నవించాడు. "ఈ విష్ణుమూర్తి ఎదో ఒక పితలాటకం పెట్టకుండా మానడు కదా" అని మనస్సు లో అనుకొంటూ, "ఇదిగో అబ్బాయ్, నారదా !! నీకు ఒక నెలరోజులు సెలవ ఇస్తున్నాను. నీవు భూ లోకం వెళ్లి అన్ని దేశాలు తిరిగి అస్సలు ఈ తండ్రులు ఏమీ వెలగపెడుతున్నారో కాస్త కనుక్కొని రా" అని పురమాయించి, విష్ణుమూర్తి విసిరిన బౌన్సర్ నించి లాఘవంగా అప్పటికి తప్పించుకున్నాడు. "అలాగే, ఈ సారి భూలోకంలోకి వెళ్లి నప్పుడు, మాస్కులు, గ్లోవ్స్ శానిటైజర్స్ వగైరాలు దగ్గర పెట్టుకోవడం మరవద్దు నాయనా ", అంటూ హెచ్చరిక కూడా చేసి తిరిగి తన సృష్టి కార్యక్రమం లో నిమగ్నం అయ్యాడు

నెల పైన ఒక వారం గడిచేసరికి తిరిగేసరికి, తిరిగి సత్య లోకానికి చేరిన నారదుడు, "తండ్రీ !! మీరేమో అంతా తిరిగి పరిస్తుతులు గమనించమన్నారు, కానీ ఈ తండ్రుల చేసే పనుల జాబితా  అంతా సేకరించేపాటికి, కొంచం ఆలస్యం అయ్యింది,  క్షంతవ్యుడిని" అంటూ తాను ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు.
  • అయ్యా, మహానుభావా !! భూలోకంలో తండ్రులు అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇళ్ళు తుడవడం ఇత్యాది విద్యల్లో మునపటి కన్నా చాలా ప్రతిభావంతులయ్యారు. అంతే కాక, వారు తమ ఈ ప్రావీణ్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా నిత్యం అప్రమత్తులై ఉండగలడం విశేషం. 
  • భూలోకం లో, ఇటీవల కాలంలో "మదర్స్ డే" అన్న ఒక సంబరం ఒకటి చేస్తున్నారు. దాని కోసరం, ఈ తండ్రి వర్గం అందరూ అహర్నిశలూ శ్రమించి, వారి వారి కుటుంబ సభ్యులందరి చేతా మాతృమూర్తలందరిని తమ తమ స్థాయికి మించి సత్కరిస్తున్నారు. మరి కొంత మంది ఔత్సాహికులయితే, తమ భార్యామణులకు ఆ రోజు పూర్తిగా విశ్రాంతి నిచ్చి కాలు కూడా కింద పెట్టనియ్యకుండా అన్నీ దగ్గరవుండీ చూసుకొంటూ ఆనంద తన్మయలు అవ్వడం గమనించాను. అదే విధము గా భూలోకం లో "ఫాథర్స్ డే" అన్న మరో ఒక సంబరం కూడా జరుపుకొంటారు అట. కానీ ఇది మదర్స్డే కి  బిన్నంగా, తండ్రి అని పిలవబడే వ్యక్తే, ఆ తారీకును గుర్తు ఉంచుకొని, బజార్లో గ్రీటింగ్ కార్డు అది కూడా సేల్ లో ఉన్నది ఒకటి కొని, పిల్లల చేత దస్తకత్తులు చేయించుకొని అదే చూసుకొంటూ మురిసిపోవడం గమనించాను 
  •  ఇక నూతన వస్త్ర ధారణ విషయానికి వస్తే, తనకున్న బట్టల్లో కొంచం కొత్తగా కనపడే చొక్కా ఒకటి బయటకి తీసి, బాగా ఇస్త్రీ చేసి తన పిల్లల చేత ఇప్పించుకొని ఒక రెండు ఫోటోలు తీయించుకొని వాట్సాప్ లలో షేర్ చేసికొని మళ్ళీ ఆ చొక్కాని నలగకుండా తన అల్మారా లో జాగ్రత్త గా పెట్టుకోవడం నేను ప్రస్ఫుటం గా గమనించాను 
  • పిల్లల భవిష్యత్తు కోసరం నిద్రాహారాలు మాని, స్కూలు, కాలేజీలంటూ తమ కుటుంబ సంపాదనని పైసా పైసా పోగేసి, వెనకేసి, మొత్తానికి తన పిల్లలని తన శక్తిమేరకు ప్రయోజకులు అయ్యారన్న సంతృప్తి తో కొంచం విశ్రాంతి తీసికొందామని అనుకొంటూ ఉండగానే, "అమ్మా ! నేనింత వాడిని అయ్యానంటే, అది అంతా నీ గొప్పతనమే అమ్మా" అంటూ తన పిల్లలు అర్ద్రోక్తి గా ఫోన్లో పలికిన పలుకులు కర్ణాకర్ణి గా వినపడడం చాలా సాధారణం గా నేను గమనించాను
*****************************************************************************
అందరికి  "ఫాథర్స్ డే" శుభాకాంక్షలు. కొంచం సరదాగా రాసుకున్న పై మాటలని మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. 

"మాతృ దెవొ భవ ! పితృ దేవో భవ ! ఆచార్య దేవో భవ ! అతిధి దేవో భవ !" అన్నది మన సనాతన ధర్మానికి పునాదిగా నిలిచిన వేదోక్తి. మన సంప్రదాయంలో పితృస్థానానికి ఇచ్చిన గౌరవం మహోతృష్టమైనది. త్రేతాయుగామందడి శ్రీ రామచంద్రుడు పితృ వాక్య పరిపాలనా యజ్ఞమునకు ఎంత తాపత్రయ పడ్డాడో జగమెరిగిన సత్యం. వరం పుచ్చుకొన్న కైక, మాతృమూర్తి కౌసల్య ఇత్యాదులకు ధర్మ సూక్ష్మమును వివరించి తన కర్తవ్యపాలన నిర్వర్వర్తించాడు. మరో అవతార పురుషుడైన జమదగ్ని సుతుండు పరశురాముడు తన తండ్రి మాటని ఏ విధంగా జవదాటలేదో మనందరికీ విదితమే.

తండ్రి నిత్యం నిస్వార్ధంగా ఫలాపేక్షరహితం గా పిల్లల అభ్యున్నతిని కోరుకొనే వాడు. సంప్రదాయం ఏదైనప్పటికీ ఈ ఆదివారం తండ్రి స్థానంలో నిలిచిన ఆ దేవతా స్వరూపాన్ని తలిచి సంతోషిద్దాం 

**************HAPPY FATHERS DAY TO ALL****************

Thursday, March 26, 2020

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

సాధారణంగా, మన సంప్రదాయాల్లో మానవ శ్రేయస్సు కోసం ఏర్పరచబడిన ఏ పూజలు, స్త్రోత్రాలు ఇతరత్రా బహుశా ఋషిప్రోక్తం లేదా స్వయానా భగవంతుని నించి అందించబడినవి. కొన్ని ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల సంభాషణల నించి గ్రహించబడ్డవి. ఇదే విష్ణుసహస్ర నామ పారాయణ ఫలశృతి భాగంగా

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యతే  పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.


శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

వేదాలు సరేసరి. అవి అపౌరుషేయాలు. సృష్టికి ముందే ఈ సృష్టికి మూలమైన స్థితి కారక శక్తి ద్వారా మనకి అందించబడ్డాయని మనం విశ్వసిస్తున్నాము. కొన్ని ఇతిహాశాంతర్గతంగా మనకి అందించబడ్డాయి. ఉదాహరణకి, రామాయణ ఇతిహాసం ద్వారా మనకి సుందరకాండ పారాయణ, ఆదిత్యహృదయం ఇత్యాదివి మానవ శ్రేయస్సు నిమిత్తం నిక్షిప్తమైనాయి. లేదా మానవాళి నిమయామావళిని నిర్దేశించే భగవద్గీత మహాభారతంర్గతమైనదే. మరికొన్ని, మనం వ్రతాల్లో, పూజల్లో "సౌనకాది ముని సంవాదే" అని ప్రస్తావించబడడం కూడా తరచూ గమనిస్తూ ఉంటాం.  అయితే విష్ణుసహస్రనామాలకి మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇది భగవంతుని సమక్షంలో, అయన ఆజ్ఞా ఆదేశలమేరకు మేరకు ఒక భక్తుడు ఇంకో భక్తుడికి ఉపదేశించబడినది. 

అయితే ఇక్కడ ఈ సంఘటనని మనం కొంచం విస్తారంగా ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత గొడవెందుకు, కృష్ణుడే స్వయానా ఇది భగవద్గీత లాగానే ఆయనే ఎవరోఒకరిని ఎంచుకొని ఉపదేశం చేస్తే పోయేది కదా అని. అయన ప్రత్యక్షంగా నిలబడి భీష్ముడి చేత స్త్రోత్రం చేయించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకి బాగా అర్ధం అవ్వాలి అంటే, మనకి కృష్ణుడి అవతారం, దాని యొక్క మూల ఉద్దేశ్యం బాగా అవగతం అవ్వాలి. 

కృష్ణావతారం మిగతా అవతారాలకంటే చాలా భిన్నమైనది. ఉదాహరణకి రామావతారంలో శ్రీరామచంద్రుడు, కేవలం మానవుడి గానే పూర్తిగా వ్యవహరించాడు. అయన తనకేదో దైవాంశ, అద్భుత శక్తులు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. రావణ సంహారం తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆయన్ని విష్ణుమూర్తి అవతారమని స్తుతిస్తూ ఉంటే, "అహం రామస్య దశరధ పుత్రాణాం" అనే సమాధానమిస్తాడు. అయితే కృష్ణుడు అలా కాదు. తన అవతార ఆవిర్భావం, సమాప్తం అంతా అయన అధీనమే అని స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం సినిమాల్లో చూసుంటాం. చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. ఇది పూర్తిగా అసంబద్దంగాను, నమ్మశఖ్యముగా ఉండదు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు.

అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు.  తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.

మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా"  తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా  పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.

మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు  తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల  ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.

కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం 
స్తువంతః కామ్ కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం 
కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః 
కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ 

సమస్త సృష్టిలోకెల్లా సర్వ శక్తిమంతుడైన భగవంతుడెవ్వడు ? ఎవరి శరణాగతి మనం కోరవలెను? ఎవరిని ప్రార్ధించంవల్ల మానవాళి కి శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి? అన్నిటి కన్నా ఈ ధర్మం గొప్పది ? ఎటువంటి జపం చేయడం వల్ల, ఈ చావు పుట్టుకల సంసార బంధనాల నించి విముక్తి కలుగుతుంది... అంటూ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా, సమస్త జగత్తునకు విష్ణు సహస్ర నామావళి, భీష్ముని ద్వారా అందించ బడింది

Thursday, January 30, 2020

దైవం మానుష్య రూపేణా

దైవం మానుష్య రూపేణా 

*********************************************************************************
నేను అమెరికా మొదటిసారి వస్తున్నప్పుడు, పక్కన కూర్చున్న ఒక వయస్సు మళ్ళిన సిక్కు వ్యక్తి మాటలు కలుపుతూ, "ఎన్నాళ్ళు కోసం ఈ దేశానికీ వస్తున్నావని" అడిగాడు. "రెండు ఏళ్ళకి మించి ఒక్క రోజు కూడా ఉండబోనని" చెప్పినప్పుడు నా యొక్క దృఢ సంకల్పాన్ని లెక్క చేయకుండా తన గుబురు గడ్డం చాటునుండి పక్కున నవ్వాడు.  సరేలే. దారిన పోయే దానయ్య ఈయనతో నాకెందుకని నా మానాన నేను ఉండిపోయాను. జీవితం కొంచం ఎక్కువగా చదివేడో ఏమి పాడో, నా విషయమేమి కర్మ, నాలాంటి కొన్ని వేల, లక్షల మంది ఆ రెండు సంవత్సరాలు ఎప్పుడు అవుతాయా అనుకొంటూనే శేష జీవితం గడిపేస్తున్నాము.

అయితే, ఇక్కడి ప్రవాసులుకు అన్నిటికన్నా దుర్లభమైన అనుభవం ఏంటంటే, అకస్మాత్తుగా తన వారిని స్వదేశంలో శాశ్వతంగా కోల్పోవడం. విషయం తెల్సిన వెంటనే, చుట్టూ ఉన్న స్నేహితులు పెట్టె సర్ది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, విమానాశ్రయం వరకు వచ్చి దిగపెట్టడం వంటివి చక చక జరిగి పోతాయి. కాకపోతే 24 గంటలు పాటు, ఈ బాధని ద్రిగమింగుతూ ప్రయాణం చేయడం, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఎట్లా చేయగలగడం అన్న విషయం ఆలోచిస్తేనే చాల కష్టం గా అనిపిస్తుంది. నా ఒక మిత్రుడు, తన తండ్రి కోల్పోయి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, "అస్సలు ఈ అబ్బాయి ఇండియా వరకు క్షేమంగా వేళ్ళగలడా" అని చాల భయపడ్డాను. అతను, న్యూయార్క్ లో ఇండియా విమానం ఎక్కే వరకు సమాచారం అందింది కానీ, మిగతా విషయాలు అన్నీ మళ్ళీ అతను తిరిగి ఒక నెల తర్వాత వచ్చే వరకు తెలియలేదు. 
న్యూయార్క్ లో ఎయిర్ పోర్ట్ నా పాటికి ఒక మూల కూర్చొని ఉంటె, ఎక్కడ నిండి వచ్చాడో తెలియదు ఒక పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి నా పక్కనే కూర్చొని, "ఆప్ బడే దుఃఖే లగ్ రహే హై" అంటూ మాట కలిపేడు, అంటూ నా మిత్రుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవాన్ని  నాతో పంచుకున్నాడు. చనిపోయిన తన తండ్రి వయస్సు ఉన్న ఆ పాకిస్తానీ వ్యక్తి, ప్రయాణం మొత్తం, ఈ అబ్బాయిని సముదాయిస్తూ, దారి పొడుగూతా తనకు సాధ్యమైనంత స్వాంతన కలిగిస్తూ, దుబాయ్ చేరిన తర్వాత లాహోర్ వెళ్లాల్సిన తన విమానం లో వెళ్లాడని చెప్పుకొచ్చాడు, నా మిత్రుడు. ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం మా నాన్న తో మాట్లాడినట్టు ఉందంటే నమ్మవు నివ్వు.. బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే అయన రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
అమ్మా!! రాజా రాజేశ్వరీ !! చాల కష్టాలు పడ్డాము తల్లీ !! ఎట్లా అయినా మా ఆయనకి ఈ ఇంటర్వ్యూ గట్టెక్కే మార్గం చూపించు తల్లీ, అంటూ తనకి చినప్పటినించీ చిర పరిచితురాలాయన ఏకైక దైవం, ఆ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మకి త్రికరణ సిద్ది గా నమస్కరించింది, శ్రావణి. దాదాపు 40 ఏళ్ల క్రిందటి మాట. మెకానికల్ ఇంజనీర్ బ్యాక్ గ్రౌండ్ తన భర్త కి, అమెరికా లో చదువు అయిన తర్వాత మొదటి ఉద్యోగ ప్రయత్నం, కొంచం కష్ట తరమైందనే చెప్పాలి. ఇండియా లో చిన్న పల్లెటూరు నించి వచ్చిన శ్రావణికి ఎటువైపు చూసినా తనకి మాట సాయం చేసే వాళ్ళు ఎవరూ కనపడడం లేదు. ఊసుపోక, పక్కెనే ఉన్న లైబ్రరీకి చేరి, అన్య మనస్కంగా అక్కడ పడిఉన్న మ్యాగజిన్ లు తిరుగావెయ్యడం చూసి, కొద్దో గొప్పో పరిచయం ఉన్న లైబ్రేరియన్ మేరీ, " వాట్స్ రాంగ్ శ్రావణి ?? ఈస్ ఎవరీ థింగ్ ఆల్రైట్??", అంటూ అడిగింది. ఈవిడ కెందుకొచ్చిన గొడవ అనుకొంటూ, తన ఆయనకి లోకల్ కంపెనీ లో రేపే ఇంటర్వ్యూ ఉందనీ, ఎవరైనా మెకానికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళ రిఫరెన్స్ ఉంటే బావుంటుందని అనుకొంటున్నాని చెప్పింది.  "రియల్లీ.. లెట్ మీ సి ఇఫ్ పాల్  కాన్ హెల్ప్ యు.." అని తన ఫోన్ నెంబర్ మరియు అడ్రస్ తీసికోంది మేరీ.
ఈవిడ ఎప్పటికి కుదిరి, ఆ పాల్ అన్న ఆయనికి చెప్పాలి అనుకొంటూ, నెమ్మదిగా తన అపార్టుమెంట్ కి చేరింది. తనకి చిన్నప్పటినించి చేత అయిన, దుర్గ, లక్ష్మి అష్టోత్తర నామావళి మననం చేసికొంటూ ఉండగానే, ఒక గంట తర్వాత ఇంటి ముందర డోర్ బెల్ మోగింది. ఎవరా అనుకొంటూ తలుపు తీయగానే, ఒక క్రిస్టియన్ పాస్టర్ తెల్ల గౌన్ వేసికొని, "I believe you are thinking of me" అంటూ నవ్వుతూ అడిగాడు. ఈయన గురుంచి నేను ఆలోచించేదేమిటని అనుకొంటూ అసలు సంగతి ఆరా తీస్తే, ఈయన్ని లైబ్రేరియన్ మేరీ పంపించందని మరియు ఈయన పాస్టర్ అవ్వక ముందర తన అయనకి ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉందొ అక్కడే ఒక పెద్ద మెకానికల్ ఇంజనీర్ గా పని చేసాడని తెల్సింది. అయన, తన భర్త resume తీసికోవడం, అందులో తగిన చేంజెస్ చేయడం, రిఫరెన్స్ ఇవ్వడం తర్వాత ఉద్యోగం లో చేరడం చక చక జరిగి పోయాయి.
బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే పాల్ రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
"స్వామి నాథన్ గారు అనడం అయితే అన్నారు గాని.. అదేమన్నా సాధారణమైన విషయమా.. మనలాంటి వాళ్ళు పని అయితే చేస్తాము కానీ గుడి కట్టడం అంటే మామూలు విషయమా", ఒక శనివారం వాలంటీర్స్ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ నించి  డ్రైవ్ చేస్తూ మనోజ్ తన పక్కనున్న స్నేహితుడి తో అన్నాడు.

"ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అన్న సామెత ఒకప్పటి సంగతేమో. ఇవ్వాళ రేపు, ఈ రెండూ కొద్దో గొప్పో డబ్బు ఉన్న వాడికి, లోన్స్ ఇత్యాది వంటివి జోడించుకొంటే ఎక్కడైనా సుసాధ్యాలే.. అయితే అమెరికాలో కొన్ని చిన్న ప్రదేశాల్లో సంకల్ప బలం ఎంత గొప్పదైనా కూడా గుడి కట్టడం అన్న విషయం చాలా సందర్భాల్లో, "భగీరథ" ప్రయత్నమే అవుతుంది.

"చూద్దాము బాసు... నివ్వు అన్నట్టు ఇది అంత ఈజీ పని కాదు" అనుకొంటూ  తమ ఇళ్ళకి వెళ్లారు. "ఇంతింతై వటుడింతై" అన్నట్టు, శంకు స్థాపన, భూమి పూజ, నిధుల సేకరణ ఇత్యాది పనులు చక చక సాగి పోయాయి. మొదటి నించి గుడి పనుల్లో చురుగ్గా ఉన్న మనోజ్ అదే సంవత్సరం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంవత్సరం మూడు నాలుగు సార్లు ఇండియా ప్రయాణం పడటంతో,  గుడి కోసం తాను విరాళంగా ఇద్దామనుకొన్న డబ్బు ఇట్టే ఖర్చు అవ్వడం కూడా జరిగి పోయింది.

"మనోజ్.. మా కంపెనీ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి వచ్చిందోయ్. కానీ ఆ  skill set ఇవ్వాళ రేపు దొరకడం చాల కష్టం. దాదాపు 20 ఏళ్ల క్రితం అందరూ వదిలేసిన వర్క్. నీకు ఎవడైనా తెలిసిన వాళ్ళుంటే చెపుతావా" అంటూ తన పరిచయస్తుడు ఒకడు ఎదో మాటల సందర్భంలో అన్నాడు. వివరాలు కనుక్కొంటే, తాను ఎప్పుడో చెన్నై లో పని చేసినప్పటి ప్రాజెక్ట్ లాంటిదే అవడం వల్ల ఆ పని చేయడం పెద్ద కష్టం అవ్వలేదు. అమ్మవారి గుడి కి తాను మొదట ఎంత విరాళం ఇద్దామనుకొన్నాడో సరిగ్గా అదే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో సహాయ పడ్డం ద్వారా మనోజ్ కి ముట్టింది.

బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ అమ్మవారే  అతని రూపంలో వచ్చి తన పని చేయించు కొందేమో సత్యా..."
*********************************************************************************
తమిళ్ బ్రాహ్మిణ్ అబ్బాయి కష్టం లో ఉంటే పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి మాట సాయం చేయడం యాదృచ్చికమా లేదా ఆ భగవంతుడికి సరిగ్గా ప్రాబ్లెమ్ అర్ధం అవ్వలేదంటారా?

దుర్గమ్మ ని పూజిస్తే క్రిస్టియన్ పాస్టర్ ప్రత్యక్షం అవ్వడం ఏంటండీ!! దేవుడి కంప్యూటర్ లో వైరస్ ఏమైనా ఉందంటారా?

అమ్మవారి గుడికి కంప్యూటర్ ప్రాజెక్ట్ కి కనెక్షన్ ఏంటో మరి.. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...
*********************************************************************************