Wednesday, February 27, 2019

సినిమా ప్రయోగాలు


నలుగురు తెలుగు వాళ్ళు కలిశారంటే మామూలుగా మాట్లాడుకొనే టాపిక్ "సినిమా". మనకి చూడ్డం కన్నా విశ్లేషణ మీదే ఆసక్తి ఎక్కువ అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదన్న నా అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారు అనుకొంటా. విళంబి నామ సంవత్సరంలో మన తెలుగు సినిమా రంగం లో కొన్ని జరిగిన కొన్ని ప్రయోగాలని స్పృశిద్దామని ఒక చిన్న ప్రయత్నం, ఈ శీర్షిక !!

రంగస్థలం: మన సినిమాల్లో మామూలుగా హీరో అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు. అయన చాల చురుగ్గా ఆలోచించ కలడు, వందల కొద్దీ కండలు తిరిగిన మగ ధీరులును ఒక్క చిటికన వేలుతో మట్టి కరిపించ గలడు, అయన శక్తి సామర్ధ్యాలు అత్యంత నిపుణులు అయిన వైద్యులు కూడా ఒక అంతు పట్టని చిదంబర రహస్యం అనే మూస నైపధ్యం లో కొన సాగుతున్న సగటు ప్రేక్షకులకు, కొంచం విన్నూత్నంగా వినికిడి శక్తి లేని ఒక పల్లెటూరి యువకుడు కూడా ఈ పాత్ర పోషించవచ్చు అని చేసిన ఈ ప్రయత్నం నిజంగా హర్షించ దగినదే !! గోదావరి జిల్లా మాండలీకంలో సాగిన ఈ 1980 దశాబ్దంలోని గ్రామీణ సంఘర్షణ కధా చిత్రం కొంత కొత్తగా వైవిధ్యంగా అనిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదనుకొంటా !! ముక్ష్యంగా మిగతా విషయాలు ఎలా ఉన్నా, గోదావరి యాస అందులోని ప్రత్యేకతలని ఈ చిత్ర కధా నిర్మాణం లో ఈ దర్శకుడు చాల నేర్పు గా వాడుకొన్నాడని నా వరకు కలిగిన అభిప్రాయం

మహానటి: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో గత కొన్నీ సంవత్సరములగా "ఇక్కడ అన్నీకృత్తిమంగా తయారుచేయబడగలవు" అనే టాగ్ లైన్ తో నడుస్తున్న తరుణంలో, "సహజత్వం" అనే పదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ తెర మీద కొన్ని తరాల ప్రేక్షలకులను మంత్రం ముగ్దులను చేసిన "మహా నటి" సావిత్రి తెర వెనుకాల జీవితాన్ని మరల అందరికి పరిచయం చేసిన అత్యంత అద్భుతమైన ప్రయత్నమే ఈ చిత్రం. హిందీ చలన చిత్ర పరిశ్రమ లో ఈ "బయోపిక్" ఒరవడి కొనసాగుతున్నాకానీ, తెలుగులో ఈ మొదటి ప్రయత్నం కొంచం సాహసోపేతమే అని చెప్పవచ్చు. ఎందు చేతనంటే మన తెలుగు చిత్ర ప్రేక్షకుల అంచనాలు చాల భిన్నంగా ఉంటాయి. ఒక రెండున్నర గంటలు పాటు ఒక వ్యక్తి యొక్క కథ చెప్పడంలో చాల నేర్పు, నైపుణ్యం కూడిన ప్రయాస. మహానటి సావిత్రి జీవనం అందులో ఉద్దాన పతనాలు, ఎదుర్కొన్న ఒడిదిడుకులు, మానవీయ సంబంధాలు ఇత్యాది నైపద్యాలు నా ఉద్దేశ్యంలో అత్యంత నైపుణ్యంగా తెర కెక్కించారని నా అభిప్రాయం.

C/O కంచరపాలెం: నాలుగు ఉప నదుల ప్రవాహం, మలుపులు, మజిలీలు కోనసాగుతూనె చివరికి ఒకే చోట చేరడం, ఒక అత్యద్భుతమైన ప్రయత్నం.  ఎప్పుడైతే ఒక సగటు ప్రేక్షకుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ కధ గురించి ఆలోచిస్తాడో, ఆ చిత్ర దర్శకుడి ప్రయత్నంలో పూర్తిగా కృతకృత్యుడు అయ్యాడనే మనం భావించ వచ్చు. ఈ సినిమా లో ప్రత్యేకం ఏంటంటే, ఒక నాలుగు ప్రేమ కధలు తాలూకు పాత్రలు ప్రేక్షకుని మనసు పూర్తిగా కట్టివేయగా, చివర ఈ నాలుగు మార్గాల కూడలి ఒకటే అంటూ ముగింపు పూర్తిగా అనూహ్యం. సాధారణంగా మన తెలుగు సినిమాలు ఈ మధ్య కొంచం వైవిద్యం కూడిన కథనైపథ్యం తో ఉంటే, అవి దిగుబడి ఉత్పత్తులు అవుతున్నాయి. కాగా, ఈ చిత్రం చిన్నదైనా పూర్తి సహజత్వాన్ని ఆపాదించుకోవడం అభినందనీయం.

2018 లో చాల మంచి సినిమాలు విడుదల అయ్యి అవి మన అందరి మనస్సులు చూరకొన్న మాట వాస్తవమే అయినా, విన్నూత్నంగా జరిగిన మొదటి ప్రయత్నాలనే ఇక్కడ స్పృశించబడినవి. 

వాజపేయి

సంస్కృతం లో "వాజపేయి" అనగా వేదములు నిర్వచించిన మహా యజ్ఞాలను జరిపిన వాడు అని అర్ధం. ఇటీవల పరమ పదించిన అటల్ బిహారీ వాజపేయి గారు ఏ విధం గా సార్ధక నామధేయులు అయ్యారో మనం ఇక్కడ మననం చేసికొనే ప్రయత్నం చేద్దాం

  • వాజపేయి  తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని జాతి ప్రయోజనాలకు సదా దోహద పడే యజ్ఞం తన జీవితం యావత్తు 93 సంవత్సరాల పాటు చేశారు
  • శత్రువు వెన్ను పోటు పొడిచినా చెదరక సైనిక స్థయిర్యాన్ని ప్రోత్సహిస్తూ కార్గిల్ విజయ పోరాట యజ్ఞాన్ని ముందుండి నడిపించారు
  • దీర్ఘ కాల ప్రయోజనాలు దృష్టి లో ఉంచుకొని ప్రపంచానికి ఎదురొడ్డి భారత దేశం పరమాణు శక్తి గా నిలిపే క్రమం లో మహోత్కృష్టమైన యజ్ఞాన్ని నిర్వహించారు
  • "వసుదైక కుటుంబం" భారత దేశం ప్రతిపాదించిన  సిద్ధాంతం అని ఐక్య రాజ్య సమితి లో చాటించి సౌభ్రాతుత్వ యజ్ఞాన్ని రాజకీయాలకి అతీతంగా నిర్వహించారు
  • 1971 యుద్ధం లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధాని ఇందిరా గాంధీ ని "దుర్గ" గా అభివర్ణించి రాజకీయ అతీత నైతిక యజ్ఞం నిర్వహించారు 
  • సరిహద్దు లకు హద్దులు చాటుతూ మొదటి సారి ఢిల్లీ నించి లాహోర్ కి బస్సు ఏర్పాటు ద్వారా ప్రయత్న లోపం లేని శాంతి యజ్ఞాన్ని చేశారు 
  • 13 విభేద భావ జాల పార్టీలను ఏకత్రాటి పై నడిపి సమైక్య యజ్ఞాన్ని అయిదు సంవత్సరాలు పాటు నడిపించారు
  • రాజకీయ వేత్త, హాస్య చతురత, కవి, సమయస్ఫూర్తి, అంకిత భావం, సిద్ధాంత ప్రమాణ వ్యక్తిత్వం ఇలా తన జీవితం అంతా బహుముఖ ప్రజ్ఞ యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహించారు
ఈ విధంగా అటల్ బిహారీ వాజపేయి తన జీవనాన్నిదేశ ప్రయోజన యజ్ఞంలో పూర్ణాహుతి గావించారని అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు

సీతా రామ దాంపత్యం


మరికొద్ది రోజుల్లో మనమందరం శ్రీ రామ నవమి జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ "సీతా రామ కళ్యాణం" గురించి కొంచం వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పండగ భారత దేశంలో మారు మూల గ్రామాలలో వివిధ పద్ధతులు ఆచారాలకు అనుగుణంగా జరప బడుతున్నది. ఎప్పుడో త్రేతా యుగం లో జరిగిన సీతా రాముల కల్యాణం ఇంకా ఎందుకని చేస్తున్నాం అన్న తర్కాలోచన లేని రోజుల్లో పండగ గుర్తులు ఏవయ్యా అంటే రేడియో లో విన్న భద్రాచలం లో కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం, గుళ్ళో మిరియాలు వేసినా తియ్యగానే ఉండే పానకం !! ఒక్క సారి అసలు త్రేతా యుగం అనేది ఎప్పుడు హిందూ కాల  మానం ప్రకారం ఎప్పుడు అయ్యింది అని ఆలోచిస్తే, సీతా రామ కళ్యాణం రమారమి ఒక 2.6 మిలియన్ సంవత్సరాలు జరిగి ఉండచ్చు అన్న నిజం తెలిస్తే మనమందరం ఆశ్చర్య చకితులు అవకమానము. అయితే ఇన్నీ సంవత్సరాల తర్వాత కూడా మనము ఈ సీత రామ కల్యాణ వైభయాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకొంటున్నామో, ఈ సందర్భంగా మానవాళికి ఇవ్వబడిన సందేశం ఏంటి, ఇది కేవలం పండగేనా లేక మన జీవన విధానాలను సన్మార్గములో మార్చుకోగలిగిన అపురూపమైన అవకాశమా.. పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 

జగత్తులో అందరి కంటే ముందరి వారు, అన్నింటింకి మూలా దారం ఎవరయ్యా అంటే, "ఆ అది దంపతులు శివ పార్వతులు" మనకి స్పురణకి వస్తారు. అమ్మ వారికి, అయ్య వారికి మధ్య దాపరికాలు ఉండవు. హెచ్చు తగ్గులకు అసలే తావు లేదు. మనకి అందిన పురాణాలు, వాంగ్మయాలు, వ్రతాలు, వ్రత  కల్పాలు అన్నీ, అమ్మ తన పిల్లల మీద దయతో, ఆదరంతో అయ్య ని అడుగుతుంది, అయన చెప్పడం జరగ బడుతుంది. ఆ కరుణ ని అవధులు, పరిమితులు ఉండవు. ఉదాహరణకి, మనమందరం ఉద్దరింప బడ డానికి, "విష్ణు" సహస్ర నామ పారాయణం ఉదహరింప బడితే, అమ్మ వెంటనే,

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యకే పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.

శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

సీత రాములు మన అందరి లాగానే సామాన్యమైన మానవులాగానే దాంపత్య వైభవము గురించి అవతరించిన దంపతులు. మన అందరి లాగానే వాళ్ళు కూడా సుఖ దుఃఖాలు, కోప తాపాలు వంటి సామాన్యమైన అనుభూతులు అనుభవించిన వారే. అందుకనే ఏ దంపతులైనా "సీతా రాములల్లె కలకాలం అన్యోనంగా పది కాలాలు వర్ధిల్లమని" ఆశీర్వాదం ఇవ్వడం మనమందరమ్ చూస్తూనే ఉంటాం. ఈ ఆశీర్వాదం ఎప్పుడూ "శివ పార్వతులల్లె" లేక "రుక్మిణి కృష్ణులల్లే"  అని ఎప్పటికి ఉండదు. అయితే ఎందుకని వీరి దాంపత్య వైభవం ఇంత ప్రత్యేకత ఎందుకని సమకూరిందో తెలిసికొనే ప్రయత్నం చేద్దాం. 

వారి దాంపత్యాన్ని గురించి ప్రస్తావించే ముందర, అస్సలు ఎవరి గురించయ్యా మనం మాట్లాడ బోయేది?

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రేమేయం 
సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
అజానుభాహుం అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి 

రాముడంటే ఎటువంటి వాడు?

రామో విగ్రహవాన్ ధర్మః !! రామో దుర్నాభి బాషితే !! 
రామః కమల పత్రక్షా సర్వ సత్వ మనోహారః 
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే 
తెజశా దిత్య సంకాశః క్షమయః పృధివీ సమః 
బృహస్పతి సమో భుధ్యా యశసా వాశావో పమః 

రామ చంద్రుడు ధర్మానికి పూర్తి ప్రతిరూపం. రాముని మాటకు రెండు భావాలూ ఉండవు. రాముని నమ స్మరణతోనే ఈ ప్రకృతి అంతా పులకరిస్తుంది అట. కోటి సూర్యులకు తుల్యమైన తేజస్సు తో బాటు పృథ్వి కి సమానమైన వినయ సంపన్నుడు, బుద్ధి లో బృహస్పతి, ధైర్యశాలి ఆ రామ చంద్రుడట. శ్రీ మహావిష్ణువుని రామావతారంలో రెండు ప్రయోజనాలు. ఒకటి రావణాసురుని అంతం ఇంకొకటి మానవాళి కి ధర్మాచరణ వైశిష్టత గురించి ఇచ్చిన ప్రత్యక్ష నిదర్శనం. ఇది కృష్ణ, నరసింహ వంటి ఇతర అవతారాలకు  పూర్తి విరుద్ధం. 

మరి సీతమ్మ తల్లో !!

ఇయం సా ధర్మ శీలస్యా  మైదిలస్య మహాత్మనా 
సుతా జనక రాజస్యా భ ర్త్రు దృడ వ్రతా 

సకల ధర్మాత్ముడైన జనక మహారాజు నాగలి పట్టి దున్నుతుండగా భూమి నిండి ఉద్భవించిన మహా సాధ్వి. జనకుడు ఈ అయోనిజను మామూలు వ్యక్తులకు ఇచ్చి తన తండ్రి బాధ్యతను అంత సులభంగా నిర్వర్చించాలని అనుకోలేదు. అనితర సాధ్యమైన మహా శివుని విల్లు చేపట్టే ధీరుని కి మాత్రమే సీతాదేవి ని పరిణయమాడ గలిగిన అర్హుడని నిర్ణయించాడు. 

హనుమ సీతాదేవి చూసిన సిద్ది సర్గలో ఈ విధంగా భావించి సంతుష్టుడు అవుతాడు. 

రాజ్యం వా త్రిషు లోకేషు సీతవా జనకాత్మజా 
త్రై లోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్  కలామ్ 

ఒక వేళ శ్రీ రామునకు కనుక సీత మరియు ముల్లోక రాజ్యాధికారం లలో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలంటే, ఒక్క ముహూర్త సమయం కూడా ఆలోచించ కుండా సీతాదేవిని కోరుకొంటాడు. రాముని మనస్సు లో ఏముందో సీత ఎల్లా వేళలా తెలుస్తుంది, అదే విధం గా సీతా దేవి ఏమి కోరుకుంటుందో శ్రీ రామునికి సదా విదితమే !! వారిద్దరిది బాధ్యతాయుత మైన దాంపత్యం. పరస్పరం ఇరువురు కర్తవ్యమ్ గుర్తు చేసికొంటూనే ఉంటారు. మీ తండ్రి దశరధుడు నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాశం చెయ్య మంటే, ఈ అస్త్రాలు శస్త్రాలు వెంట పెట్టు కొని ఎందుకు వచ్చావయ్యా? రాక్షసులతో ప్రత్యక్ష వైరం లేకపోగా వాళ్ళ అందరిని సంహరిస్తానంటివే, అంటూనే సీతా దేవి రాముని దుష్ట శిక్షణ కై పరోక్షం గా దృడ సంకల్పుడిని చేస్తుంది. "సీతా !!  శరణా గతి చేసిన ఋషులను రక్షించడమే నా ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధన లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా నేను లెక్క చేయను" అని ప్రతిజ్ఞ చేయిస్తుంది. ఇదే విషయం ని లంక లో నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు, రామునికి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది . "రామా, మనశా వాచా కర్మణ, నిన్నే స్మరిస్తునాను అయ్యా !! మరి ఎందుకని వచ్చి నన్ను రక్షించవు ? నీవు శరణా గతులని రక్షిస్తావంటివే, మరి ఎందుకని నన్ను ఈ లంక లో నిండి, ఈ రాక్షసుల బారి నిండి కాపాడి తీసి కెళ్లవు ? నా వ్రతం లో గాని లేక తపస్సు లో గాని ఏమైనా లోపం ఉన్నదా" అంటూ హనుమ తో శ్రీ రాముడు కి సందేశం పంపిస్తుంది !!

వారిరువురు క్షణ కాలమైనా వియోగం భరించలేరు. అంతటి శ్రీరాముడు కూడా దుష్ట రాక్షస ప్రమేయంతో సీతాపహరణం జరిగిన వేళ నిస్సహాయుడు అవుతాడు. 

ఉపవాశ కృ శాం దీనాం నిశ్స్వ సంతీం  పునః పునః 
దదర్శ శుక్ల పక్షా ధౌ చంద్ర రేఖాం మివానలామ్ 

అపహరింపబడిన సీతాదేవి, శోకసముద్రురాలై అశోక వనంలో సదా పతి  చింతనతో అనుక్షణం గడుపుతూ ఉంటుంది. అదే విధంగా శ్రీ రామచంద్రుడు కూడా సర్వము కోల్పోయినవాడల్లే నిశ్శక్తుడై గడుపుతూ ఉంటాడు. ఇదేవిషయం హనుమ అశోకవనంలో ప్రస్థావిస్తాడు. 

నిత్యం ధ్యాన పరో రామో నిత్యం శోక పరాయణ 
నాన్యచింత యతే కించిత్ సతు కామవశమ్ గతః 

అమ్మా!! శ్రీ రామచంద్రుడు సకలావశ్తలందు నీ ధ్యాశ లోనే మునిగి, నిన్ను చేరుకొనడం అన్న ఆలోచన తప్ప వేరే ఏమీ కోరిక లేని వాడై ఉన్నాడమ్మా.. అంటూ హనుమ వివరిస్తాడు . అదే విధం గా సీతమ్మ తల్లి కూడా, 

దీనోవా రాజ్య హీనోవా వామో మే భర్త సమే గురు 
తమ్ నిత్య మనురక్తాస్మి యధా సూర్యం సువర్చలా 

రాక్షస రాజు రావణుడు సీతాదేవి ని ఐహిక లాభాలతో ప్రలోభపెడితే, ఆ అమ్మ, "నా రాముడు దీనుడైనా, రాజ్య హీనుడు అయినా, అతడే నాకు గురువు. నేను సదా నా పతికి  అనురక్తురాలును" అని అంటుంది.

ఇదే భావం అరణ్య కాండలో మరొక సందర్బం లో కూడా వెల్లడిస్తుంది. 14 సంవత్సరాల అరణ్య వాసం తండ్రి ఆజ్ఞ శిరసావహించడానికి ఉద్యుక్తుడు అవుతూ, "సీతా !! ఈ శాసనం నాకు మాత్రమే వర్తిస్తుంది. నీవు నా వెంట వచ్చి అరణ్యవాస కష్టాలు అనుభవించవల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు" అని అనగా ఆ దేవి, "భర్త వెంట లేకపోవడమే తనకి అత్యంత దుర్భరమైన కఠిన శిక్ష" అని పేర్కొంటుంది. 

సీతా రాముల కళ్యాణం కమనీయం !! వారి దాంపత్యం ఆదర్శప్రాయం  !! ఇప్పటికి, ఎప్పటికి రామాయణ వైభవమే మనకి సదా పూజ్యనీయం !! రామాయణ వైభవం తలిచి, కొలిచి ఎందరో మహానుభావులు తరించారు. అన్నింటి కన్నా ముక్ష్యంగా రామ నామ పారాయణంనకు  మంగళ ప్రదుడైన హనుమ మన వెంటే ఉంటాడు. 

యత్రః యత్రః  రఘునాదః కీర్తనం 
తత్రః తత్రః క్రుతమస్తః కాంజలీమ్ 

రామ నామం మానవ జీవితాల్లో ఎంతగా ఇమిడీ కృతం అయ్యిందంటే,  మన పేర్ల్లల్లో  రామ నామం చేరుస్తాం, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముడినే తలుస్తాం, మన సంప్రదాయం ప్రకారం వివాహ శుభ పత్రికల్లో కూడా ఆ నాటి సీత రామ తలంబ్రాలే ఆ కొత్త జంటకి ఆశీర్వాదం కావాలన్నా తలంపు తోనే

జానక్యః కమలాంజలి పుటేయః పద్మరాగాయితః 
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితః 
స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్ర నీలయితః 
ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికః 

అన్న శ్లోకం ముద్రిస్తాం . ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా ధన్య వాదాలు తెలుపుతూ, ఆ రామానుగ్రహం  మన అందరి పైనా సదా ఉండాలి అని కోరూతూ "సర్వే జనః సుఖినో భవంతు", "జై శ్రీ రామ్"