Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు