Tuesday, July 12, 2016

చక్ర భ్రమణం

సరోజా ! ఇది చూసావా.. ఈ రోజు ఉష్ణోగ్రత వివరాలు - 44 c.. ఇంకేముంది! దుంప తెగిందన్న మాటే !

అయ్యా బాబోయ్! ఇంకా రోహిణి కార్తె చూస్తే కనీశం నెల పైనే ఉంది. రాను పోను, మొత్తం ఆరు కిలోమీటర్లు, కాలి నడక ! ఎట్లా నెగ్గుకొస్తారో ఏమిటో !

ఎట్లా ఏముంది..  ఉద్యోగం అన్నాక తప్పుతుందా! పోనీ ఎండ ఒక్కటి అనుకొంటే పర్వాలేదు.. సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయినా కూడా వాడ గాల్పులాయే!

పోనీ సైకిల్ ఒకటి తీసికోరాదండీ.. హంబరో, హీరో నో ?

తీసికొంటే, బావుంటుంది కానీ, మనకి వచ్చే జానా బెత్తడు జీతానికి, ఉన్న పళాన వెయ్యి రూపాయల  ఖర్చు అంటే మాటలా? పోనీ సెకండ్ హ్యాండ్ తీసుకొందామంటే, ఎవరినో మోసిన ఇనప సామాను మన ఇంటికి ఎందుకంటావ్..

అయిందిగా ఆ ముచ్చట కూడా! మీ బావ 15 ఏళ్ల నాటి అంటగట్టిన సైకిల్ ఒక్క మూడు నెలలు వాడారో లేదో, పాత ఇనప సామాన్ల వాడు కూడా ఛీ పొమ్మంటున్నాడు.

 ఇది ఇప్పట్లో తెమిలేది కాదులే. ఈ వేసవి కాలం ఎలాగోలా నడపాల్సిందే.. 

దాదాపు నలభై ఏళ్ల క్రిందటి మాట! రామారావు బెజవాడ లో ఒక ఆడిటర్ గారి ఆఫీస్ లో గుమస్తా. వరసే కదా అని దూరపు చుట్టాలమ్మాయిని చేసికొన్నా, సరోజ అందం, అణుకువలకి అత్యంత ముగ్దుడైన రామరావు చాలా దగ్గరగానే సంసారం చేయసాగాడు. ఎంత దగ్గరగా అంటే, పెళ్ళైన సంవత్సరం తిరక్కుండానే, అదృష్టం ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించింది. "లక్ష్మీ దేవోయ్, రామరావ్! ఇంక నీకు తిరుగు లేదంటే నమ్ము!", అని పిల్లని చూట్టానికి వచ్చిన పైన మామ గారు సెలవిస్తే, శుక్రవారాలు తలుపు దగ్గరగా కూడా వెయ్య రాదని సరోజ కి స్త్రిక్ట్ వార్ణింగ్ ఇచ్చాడు. పిల్ల పుట్టడం తో కొద్దీ పాటి ఎడబాటు సంభవించినా, భర్త బాధ్యతలని ఏనాడు రామ రావు విస్మరించక పోవడంతో, మిగతా ఏడుగురు లక్ష్మీల మాట ఎట్లా ఉన్నా, సంతాన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించడంతో, మరో ఇద్దరు మగ పిల్లల ఇట్టే పుట్టడం, రామరావు "కుటుంబ రావు" గా పరివర్తనం చెందడం ఇట్టే జరిగి పోయాయి. 

రామారావు స్వతహాగా తెలివైన వాడు. బండెడు సంసారం మరియు ఇతరత్రా కుటుంబ కారణాల రీత్యా,  వాళ్ళ నాన్న పదో తరగతి దాటగానే, ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అన్నయ్యల దెగ్గర చేరి, ఇంకో రెండు సంవత్సరాలు బండి లాగించాడు రామ రావు. ఈ క్రమంలో, తెలిసిన బంధువులాయన దగ్గర అకౌంట్స్ చూడడం, పన్నుల కి సంబందించిన వ్యవహారాల్లో కొద్దో గొప్పో, రాణింపుసంపాదించుకున్నాడు. తర్వాత, ఇంక నా వల్ల కాదురా అని రామ రావు ని అదే ఊర్లో ఉన్న ఆడిటర్ గారి దగ్గర లెక్కలు చూసే పనిలో పెట్టేసాడు.  ఈ క్రమంలో రామరావు చురుకు, ఉత్సాహం చూసి నచ్చిన ఆ ఆడిటర్ గారు, నెమ్మదిగా కొంచెం పేరు ఉన్న వ్యాపారస్తుల అకౌంట్స్ చూడమని పురమాయించాడు. పేరుకు "రాముడైనా", మనస్తత్వం అంతా ఆంజనేయుడవటం, అతి కొద్దీ కాలం లోనే యజమాని నమ్మకాన్నిచూరగొని, హెడ్ గుమస్తా గా ప్రమోషన్ రావడం, తన కింద ఇంకో ఇద్దరు గుమస్తా లను నియమించడం ఇట్టే జరిగి పోయాయి. మరీ డిగ్రీ అయినా లేకపోతే ఎం బావుంటుంది అని, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రైవేట్ గా B.COM పూర్తి చేసాడు. గవర్మెంట్ ఉద్యోగం కాదనే కానీ, రామరావు పని చేసే సంస్థ వారికి  మిగతా వ్యాపారాలు కూడా ఉండడం తో అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతి నిండా పనే.  

"అసలే ప్లస్ లో ఉన్నావ్! పైగా జీతం కూడా పెరిగింది.. నక్కని తొక్కావురా రామారావ్!", అంటూ నెల్లూరు నించి కాకినాడ ప్రయాణం చేస్తూ ఊరు మీదుగా వెళ్తూ ఆగి పలకరించక పోతే ఏమి బావుంటుందని ఆగిన బాబాయ్ వరుస అయ్యే బంధువు ఇచ్చిన కితాబు. "ఎం ప్లస్సో బాబాయ్! ఈ సంసారరధచక్రాలు లాగడం అంటే మాటలు కాదు. గత అయిదు సంవత్సరాల్లో,  గానుగెద్దు తిరిగినట్టు ఆఫీస్ నించి ఇంటికి, ఇంటి నించి ఆఫీస్ కి ఎండైనా, వానైనా కాలి నడక తప్పట్లేదు కదా. ఒక్క సైకిల్ కొనుక్కొందామంటే, ఏదీ..", అంటూ వాపోయాడు రామారావు. "ఏమి చేస్తాం నాయనా, త్రేతా యుగంలో శ్రీ రాముడికే తప్పలేదు ఈ సంసార ఈతి బాధలు, కలియుగం లో రామరావు మాత్రం తప్పించమంటే ఎట్లా", అంటూ  తన బండి టైం అవ్వడం తో బయలుదేరాడు. 

చూస్తూనే పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టారు. రామరావు నడవటం అన్నా, నడవక్కర లేకుండా గమ్యం చేరే సమస్త చరా చర ప్రాణి కోటి అన్నా తెలియని ద్వేషం పెంచుకున్నాడు. "ఆహా! మనం కూడా భూ కైలాష్ సినిమా లో నారదుడికి మల్లె ఆకాశ మార్గం లో ప్రయాణిస్తే ఎంత బావుంటుందో కదా.. వెదవ పిచ్చుక ఒక చోటి నించి ఇంకో చోటికి ఎంత హాయి గా ఎగురుతోందో కదా..", ఇలా సాగేవి అతని ఆలోచనలు రోజు తనకి తప్పని నడక ప్రయాణంలో. పోనీ ధరించి సైకిల్ కొందామంటే, ప్రతి సంవత్సరం పెరిగే యాబయ్యో, వందో జీతం తో పాటు ఇంటి ఖర్చులు ఇంకొంచం పై చెయ్యి కావడం తో బొటాబోటిగా సరి పోయేది. ఎప్పుడైనా, పండక్కో లేదా యజమాని ఇంట్లో శుభ కార్యాలకో లభించే అదనపు ఆదాయం, భార్య పిల్లలకి బట్టలు కొనగా మిగిలే అనిర్వచనీయమైన సంతోషానికి సాక్షీ భూతం గా నిలబడి, తన కష్టాన్ని తనలోనే అణుచుకొనే వాడు. 

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా, ఎండా కాలం లో మాత్రం నెట్టి మీద ఒక రుమాలు గుడ్డ కట్టుకొని నడవాలంటే అంతంత దూరం నడవాలంటే ప్రాణం ఉసూరుమనేది. "ఈ నెలలో అయినా సైకిల్ కొనాల్సిందే", అని ఆ రోజుకి నలభై ఒకటో సారి గట్టిగా తనకి తాను చెప్పు కొన్నాడు. అందులోనూ క్రితం రోజు రాత్రి "installments లో అయినా వెధవ సైకిల్ ఒకటి కొందామండీ" అంటూ భార్య ఊతం కూడా రామ రావు దృఢ నిర్ణయానికి కారణ భూతం అయిందేమో.  మొత్తానికి రాబోయే ఆదివారంకి శుభ ముహూర్తం నిర్ణయించుకున్నారు, భార్యా భర్తలిద్దరూ. శనివారం ఒన్ తౌన్ లో ఉన్న సైకిల్ షాప్ కి వెళ్లి ఇంస్టాల్మెంట్ వివరాలు అన్నీ వాకబు చేసి ఇంటికి చేరే టప్పటికి, ఇంటి నిండా పండగ వాతావరణం కనిపించింది. కొంచం ఎడమ కన్ను అదురుతున్నప్పటికిన్నీ గుండె దిటవు చేసికొని, సరోజ ఇచ్చిన కూజా నీళ్లతో గొంతు తడుపుతుండగా, "ఏమండీ విన్నారా ? మా పెదనాన్న గారి అబ్బాయి, అదేనండి మా అమెరికా అన్నయ్య రేపు మన ఇంటికి వస్తున్నారట !! ఈ రోజే కబురొచ్చింది" అంటూ ఉబ్బి తబ్బిబ్బు అవుతూ చెప్పింది. ఎప్పుడో పెళ్లి నాటికి చూశాడాయన్ని రామ రావు. "సరే అంత పెద్ద హోదా గల వాళ్ళు మనని  గుర్తు పెట్టుకొని మరీ వస్తున్నారంటే ఆనందించ దగ్గ విషయమే కానీ, "దీనికి నా సైకిల్ కి ఏమైనా లింక్ ఉందా" అని గునిసాడు. "మరి ఎం చేస్తాం, చెప్పండి? రాక రాక మన ఇంటికి వస్తున్నారాయె. వస్తూ పిల్లలికి ఏదో ఒకటి  తేక పోరు. ఏదో మన స్తాయి లో వాళ్ళ పిల్లలికి బట్టలయినా ఇవ్వక పోతే ఎలా చెప్పండి?", అంటూ అనునయనంగా చెప్పింది సరోజ. సరే, తప్పుతుందా అనుకొంటూ, సైకిల్ అడ్వాన్సు కోసం పక్కన పెట్టిన డబ్బుతో , సరోజ చెప్పిన వస్తువులు కొనడంతో నిమగ్నం అయ్యాడు. వచ్చిన చుట్టాలతో అమెరికా విశేషాలు మాట్లాడుతూ ఉండగా రామారావు ఏదో సందర్భంలో, "ఏమండీ ! మీ దేశం లో ఖాళీ సమయాల్లో ఏమి చేస్తూ ఉంటారండీ", అని అడిగాడు. "ఖాళీ ఎక్కడండీ ? అమెరికా లో ప్రతి నిమిషం విలువైనదే నండీ! కానీ రోజు సాయంత్రాల్లో మాత్రం, నేను నా భార్య కనీసం ఒక్క అర గంట అయినా నడుస్తూ ఉంటాం. వ్యాయాయం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదండీ", అనగానే భార్యా భర్తలు ఇద్దరూ మోహా మొహాలు చూసుకొన్నారు. రామా రావు కి మళ్ళీ నడక కష్టాలు తప్పలేదు.

కానీ రోజులు అన్నీ ఒకే మాదిరి గా ఉండవు కదా. మారే ప్రపంచ పరిస్థితులతో పాటుగా భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా పగ్గాలు విడిచిన రేసు గుర్రం లాగా పరిగెత్తడం మొదలు పెట్టింది. రామారావు ఎంత పని ఒత్తిడి ఉన్నా, C.A పరీక్షలు పట్టు పట్టి పాస్ అయ్యాడు. అసలే అకౌంట్స్ మరియు పన్నుల వ్యవహారాలులో మంచి అనుభవం గడించిన వాడు అవ్వడం మూలాన, అతనికి అంటూ ప్రాక్టీస్ ఏర్పడడం పెద్ద కష్టం అవ్వలేదు. అదృష్ట వశాత్తూ పిల్లలు ముగ్గురూ ఆణి ముత్యాలుకి మల్లె చదువు లోనూ, గుణము లోనూ ఎవ్వరికీ తీసిపోని విధంగా నిలబడ్డారు. అమ్మాయి ఈ మాత్రం కోచింగ్ అవసరమే లేకుండా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ సంపాదించింది. మొగ పిల్లలు ఇద్దరూ అమ్మాయి అంత కాక పోయినా గవెర్నమెంట్ కాలేజ్ లోనే సీట్లు సంపాదించారు. "లక్షలకి లక్షలు గుమ్మరిస్తే  ఏమి లాభం! స్వతహాగా మెరిట్ ఉండాలండి. మా పిల్లలని చూడండి, అందరికి బ్రహ్మ ప్రళయం అయిన సీట్లు ఇట్టే సంపాదించేసారు", అని అడిగిన వాడికి అడగని వాడికి చెప్పసాగాడు. "ఊరుకోండి! మీరు మరీనూ! పిల్లలకి దిష్టి తగులుతుంది", అంటూ సరోజ ఉప్పు డబ్బాలు కరిగించేసింది.

తన ప్రాక్టీస్ లో గణనీయంగా పెరుగుదల  ఉండడంతో, సైకిల్ కె గతి లేని రామ రావు, ఉన్న పళాన పెద్ద కష్టపడకుండా స్కూటరే కొనేసాడు. సరోజ  చుట్టూ పక్కల వాళ్ళ అందరికి ఒక చిన్న పాటి తేనీటి విందు ఏర్పాటు చేసింది. "మా వారికి వాహన యోగం చిరకాల వాంఛ అండీ. ఇన్నాళ్లకి నెరవేరింది" ఆంటూ తెగ మురుసుకు పోయింది. గుళ్లో పూజారి నిమ్మకాయలు మీదుగా స్కూటర్ నడప మన్నప్పుడు మొదలు రామ రావు నడక అన్న పదానికి దాదాపు స్వస్తి పలికాడు. వీధి చివర ఉన్న కిరాణా కొట్టు కి వెళ్లాలన్నా స్కూటర్ కె పని చెప్పేవాడు.

భార్యా భర్తల పూర్వ జన్మ సుకృతమో ఏమో, అమ్మాయి తన కాలేజ్ లోనే చదువుకొన్న మరో డాక్టర్ అబ్బాయి తో కాణీ కట్నం లేకుండా పెళ్లి జరిగింది. అబ్బాయిలు ఇద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. రామారావు ఉద్యోగ పెరుగుదల తో పాటు, పిల్లలు ముగ్గురూ చేతికి అందిరావడం తో ఒక శుభ మూహూర్తాన మూడు వందల గజాల స్థలంలో లోను తీసికొని చక్కటి ఇల్లు కూడా కట్టుకోగలిగాడు. అమ్మాయి, అల్లుడు స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి ఊళ్ళో మంచి హస్త వాసి గల డాక్టర్ల గా పేరు పొందారు. మొగ పిల్లలు ఇద్దరూ వాళ్ళు పని చేసే కంపెనీలలోనే అవకాశం రావడంతో అమెరికా లో స్థిర పడ్డారు. "ఇంకా, ఆ డొక్కు స్కూటర్ ఏమి నడుపుతావు నాన్న! మంచి కార్ కొనుక్కో అని పెద్దవాడు ఒక A.C కార్ కొని పెట్టాడు. ఎండా కాలం ఏమీ అవస్థ లేకుండా చిన్న వాడు ఇంట్లో అన్ని గదుల్లో A.C పెట్టించాడు.

ఇప్పుడు సరోజకి ప్రొద్దునే వంటకి ఒక మనిషి, ఇంటి పనులు చేయడానికి నమ్మకమైన పని మనుషులు స్థిర పడ్డారు. ఇంకా ఏ మాత్రం కష్ష్ట పడద్దు అంటూ పిల్లలు వాషింగ్ మిషన్లు, డబుల్ డోర్ ఫ్రిడ్జిలు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ లు సమస్తం అమర్చారు. సరోజ, రామ రావు లు క్రమ క్రమం గా "సరోజమ్మ గారు, రావు గారు" గా పరి వర్తన చెందారు. ఎప్పుడూ బక్క పలచగా ఉండే రామ రావు కొంచం రంగది వచ్చి ఒళ్ళు కూడా చేసాడు. వయస్సు కి తగినంత పొట్ట కూడా వచ్చి, తన హై క్లాస్ మిత్రులతో అప్పుడప్పుడు ఇంకా కొంచం ఒళ్ళు చేయడానికి దోహద పడే బీర్, స్కాచ్  వంటి అలవాట్లు కూడా  సంక్రమించాయి. రోజూ అలవాటు గా దైనందిక సీరియళ్లు అన్నీ ముగించు కొని పదుకొనె ముందు న్యూస్ ఛానెల్స్ లో ప్రపంచంలో సామాన్యుడికి అవసరం లేని విషయాల పైన తీవ్రమైన చర్చలన్నింటి లోనూ  లీనమై, కొన్ని మంచి పాయింట్స్ రేపటి క్లబ్ లో మిత్రులతో పంచు కోవడానికి బాగా మననం చేసికొని పడుకొన్నాడు. కొంచం మగత గా నిద్ర పడుతూ ఉండగా, కొంచం గుండెల్లో భారం గా అనిపించడం మొదలు అయ్యింది. ఏంటో అర్ధం గాక భార్య ని లేపుదామా అనుకొంటూనే, "ఎందుకులే కంగారు పడుతుంది, అదే తగ్గుతుంది లే, కొంచం సేపు చూద్దాం" అని అనుకొన్నాడు.. ఏ తెల్ల వారు జామునో, రాత్రంతా అటు ఇటు దొర్లుతున్న రామ రావు ఇంక లాభం లేదు అనుకోని సరోజని నిద్ర లేపి హాస్పిటల్ కి  తీసికెళ్ళమని చెప్పాడు.

వెంటనే, ఊళ్ళో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి చేరిన రామ రావు కి, వైద్య శాస్త్రం లో ఉన్న అన్ని రకాల టెస్ట్స్ చేసిన తర్వాత, వార్త విని హూటా హూటా న పరిగెత్తుకొచ్చిన అమ్మాయి తో చీఫ్ డాక్టర్ ఇలా చెప్పాడు. "ఎం లేదమ్మా!! నీకు తెలియంది ఏముంది. ఒంట్లో కొవ్వు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. ఒక నాలుగు రోజులు ఆబ్సెర్వేషన్ లో ఉంచి పంపిస్తాం", అంటూ రామ రావు వంక తిరిగి, "రావు గారు! తిండి లో ఉప్పు కారం పూర్తిగా తగ్గించేయాలి. ఇంక నించి రోజూ కనీశం నాలుగైదు కిలోమీటర్లు నడవాలండీ. పాపం మీకు నడక అలవాటు ఉందొ లేదో! కానీ తప్పదు అలవాటు చేసికోవాల్సిందే", అని పక్క రూం లో ఉన్న పేషంట్ ని చూడ్డానికి కదిలాడు.

రచయిత :  గతంలో మధ్య తరగతి కుటుంబాల్లో అదనంగా ఒక వస్తువు కొనాలంటే దాదాపు బ్రహ్మ ప్రళయమే !! టి వి, సైకిల్, పట్టు చీర ఇలాంటి వస్తువు కొనాలంటే వాళ్ళు పడే ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. మారిన పరిస్తుతుల రీత్యా వస్తు సమీకరణ సులభతరం అయినా, వారి జీవితాల్లో వాటి స్తానం లో ఇతరత్రా సమస్యలు చోటు చేసికొన్నాయన్న సందేశం కోసం చేసిన  చిరు ప్రయత్నం 

Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు