తెలంగాణా ఉద్యమం మళ్లీ ఆగింది. దీని అర్ధం, పరమార్ధం పెరుమాళ్ళ కి ఎరుక. కొన్నాళ్ళ క్రితం ఈ ఉద్యమం నిజమైనదే ఏమో అన్న ఊహ తెలంగాణా మరియు ఏతరలుకి తోచిన మాట వాస్తవమే అని గమనించాలి. దీనికి ముక్ష్య కారణాలు.
- ఉద్యమం కనీసం ఒక సంవత్సర కాలం సాగింది. ఇంకా మరెంత కాలం సాగుతుందో చెప్పలేక పోతున్నాము.
- ఉద్యమ సారూప్యం ఏ విధంగా ఉన్నా ప్రజా బలం ఉందన్న సత్యాన్ని గమనించాలి.
- గతం లో ఈ ఉద్యమం వికృత రూపం తీసుకొని ఉన్నా పూర్తి స్తాయి లో ఇది రూపు మాపడం లేదు. (చెన్నా రెడ్డి నాయకత్వం లో సాగిన ఉద్యమం తో కలుపుకొని)
- తమ అవకాశాలని వేరే ఎవరో పూర్తి స్తాయి లో తన్నుకు పోయారు అని తెలంగాణా ప్రజలు బలంగా విశ్వసించబట్టి.
నేను తెలంగాణా ఉద్యమం యొక్క ప్రస్తుత నాయకత్వానికి, ఎత్తుగడలకి, రూపు రేఖలకి పూర్తి స్తాయి లో వ్యతిరేకం అయినా కూడా ప్రజల ఆకాంక్షల ని తప్పు పట్ట గలమా అన్న ప్రశ్న వేసికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య ని పక్కకి నెట్టడం సరి అయిన వ్యూహం కాదన్న సంగతి చరిత్ర ఇలాంటి ఒక సందర్భం లోనే ఒక సారి నాయకత్వానికి గుణపాటం నేర్పింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఏమైనా ప్రస్తుత పరిణామాలకి పాఠం నేర్పగలదా ? ఇప్పటి వరకు అధ్వానపు అధిష్టానం మరియు రాష్ట్ర (అ)నాయకత్వం స్వీకరించిన నిర్లక్ష ధోరణి రాబోయే తరాలకి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయ బోతోంది ?
డిసెంబర్ 1950 లో సర్దార్ వల్లభ్భాయ్ మరణించారు. నెహ్రు ప్రధాన మంత్రి పదవి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. మరో దశాబ్దం వరకు నెహ్రు అనుకొన్న ఇండియా తీర్చి దిద్దబడడానికి సంసిద్ధం అయ్యింది. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహార శైలి ఇలా దాదాపు అన్ని. కాని అనుకోకుండా జరిగిన కొన్నిసందర్భాలు నెహ్రు గారికి పంటి కింద రాయి లాగ, కంటి లో నలుసు గా మారాయి. అందులో ఒకటి....
బాషా పరమైన రాష్ట్ర ఏర్పాటు. కన్నడ, మలయాళం లేదా ఒరియా ఇలా కాంగ్రెస్ పెద్దలు తమ తమ రాష్ట్ర ఏర్పాటు కోసరం పాటు పాడడం మొదలు పెట్టాయి. ఇందులో తీవ్ర స్తాయి లో గళం విప్పింది మాత్రం ఆంధ్రులే. బాషా పరంగా హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత అధికులు తెలుగు వాళ్లే. అంతే కాకుండా బాషా పరంగా విజయ నగర పాలనా నించి వైభవం ని చవి చూసిన జాతి కూడా తెలుగు వాళ్లే. మద్రాస్ మరియు హైదరాబాద్ లలో అత్యంత చురుకు గా ఆంధ్ర మహాసభ సభ్యులు తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర శాసన సభ్యులు ఆంధ్ర ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు నకు సంఘీభావం వ్యక్త పరిచారు.
ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఇద్దరికి మాత్రం ఏ మాత్రం రుచించలేదు. నెహ్రు మరియు రాజగోపాలాచారి మాత్రం రాష్ట్ర ఏర్పాటు నకు అది సరి అయిన సమయం కాదని కొట్టి పారేసారు. ఆ సమయం ఏదో, ఎప్పుడు వస్తుందో తేల్చాల్సిందే అని ఆంధ్రులు పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు అన్న ఒక గాంధేయవాది తన జీవితం లో రెండవ సారి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. మొదటి సారి మద్రాస్ లోని ఆలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం 1946 సంవత్సరంలో దీక్ష చేసారు. అప్పటి మద్రాస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు స్వతంత్ర ఉద్యమం నకు ఇది ఒక అడ్డంకి అని భావించి గాంధీ గారిని పొట్టి శ్రీ రాములు చేత దీక్ష విరమణ చేయమని అభ్యర్ధించారు. గాంధీ గారి అభ్యర్ధన మేరకు అప్పటి దీక్ష విరమించినా 1952 నాటికి తెలుగు రాష్ట్ర సాధనకై మళ్లీ ఉద్యమం చేపట్టారు.
"ఏదో ఒక నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టారు అని వార్త నా దృష్టి కి వచ్చింది. మనం ఎటువంటి పరి స్తితులలో అయినా కూడా ఈ యొక్క ఆందోళన కి ప్రాధాన్యత ఇవ్వరాదు" అని రాజగోపాలాచారి ఉత్తరం పంపారు పండిట్ నెహ్రు. అప్పటికే శ్రీరాములు గారు ఆరు వారాల బట్టి నిరాహార దీక్ష ని నిర్వహించారు. ఆధిపత్యం లో ఉన్న పెద్దలు ప్రత్యెక రాష్త్ర ఏర్పాటు నకు సరియైన సమయం రాలేదు అనే నమ్మారు అదే విషయం పార్లమెంట్ లో పదే పదే నమ్మించ డానికి ప్రయత్నం చేసారు. దీక్ష అలాగే కొనసాగింది. రాష్ట్ర నలుమూలల రాజాజీ మరియు నెహ్రు ల వ్యతిరేక నినాదాలు పెల్లుబికాయి. నెహ్రు కి దిగిరాక తప్పలేదు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు కై మళ్లీ ఇంకొక లేఖ వ్రాసారు. కాని దురదృష్త వశాత్తు అధికారిక ప్రకటన వచ్చేలోపే పొట్టి శ్రీ రాములు గారు గతించారు. ఆంధ్ర రాష్త్రము అతలాకుతలం అయ్యింది. రైళ్ళు తగల పెట్టారు. పట్టాలు పీకేశారు. ఆంధ్రుల ఆగ్రహం తీవ్రత అంటే ఏంటో దేశమంతా చాటారు. సామరస్యంగా జరగవలసిన విభజన రక్తపాతం తో జరిగింది.
మళ్లీ రాబోయే తరాలు ఈ విధమైన విభజన ని ఎదుర్కోవాల్సి వస్తుందా ? ఏ పాపం తెలియని నవ తరాల మనస్సులని విభజించే సావకాశం కల్గుతుందా ? చూద్దాం !!